ఏపీలో ఎన్పీఆర్: పౌర నమోదు అమలుకు జగన్ సర్కార్: ఉత్తర్వులు జారీ..!
అమరావతి: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన జాతీయ పౌర నమోదు (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్-ఎన్పీఆర్)ను అమలు చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్పీఆర్ రూపకల్పన దిశగా జగన్ సర్కార్.. అడుగులు వేస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ (ఎన్ఆర్సీ)లపై ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం.. ప్రస్తుతం ఎన్పీఆర్ను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య..
దీనిపై బుధవారమే ఉత్తర్వలు జారీ అయ్యాయి. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఎన్పీఆర్ను అమలు చేయనుంది. ఈ ఆరు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి వీలు కల్పించింది. జాతీయ పౌర నమోదు చేపట్టిన 45 రోజుల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.
ఎఫ్ఏక్యూ జారీ..
ఎన్పీఆర్కు సంబంధించిన కొన్ని తరచూ అడిగే ప్రశ్నలు (ఫ్రీక్వెంటీ ఆస్కడ్ క్వశ్చన్స్)లను జారీ చేసింది ప్రభుత్వం. దీన్ని బట్టి చూస్తే.. ఎన్పీఆర్ నమోదు వ్యవహారంలో ఎలాంటి డాక్యుమెంట్లను కూడా చూపించాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకున్నట్లు కనిపిస్తోంది.ఈ మేరకు లెక్కింపు సిబ్బందికి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. భారతీయ పౌరసత్వాన్ని రుజువు చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లను చూపించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
లెక్కింపు సిబ్బందికి మార్గదర్శకాల్లో..
అలాంటి డాక్యుమెంట్లు తప్పనిసరిగా చూపించడంతో పాటు తాము అడిగే ప్రశ్నలన్నింటికి సమాధానమిచ్చి తీరాలని ప్రజలను ఒత్తిడి చేయవద్దని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో లెక్కింపు సిబ్బందికి సూచించింది. ఎన్పీఆర్ ప్రక్రియకు సంబంధించినంత వరకు ప్రజలు చెప్పిన విషయాలను నమోదు చేసుకుంటే సరిపోతుందని పేర్కొంది. అదేవిధంగా వారికి ఇష్టంలేని ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరమూ లేదని సూచించింది. అలాంటి ప్రశ్నల కోసం ప్రజలను ఒత్తిడికి గురి చేయొద్దని స్పష్టంగా ఆదేశించింది.