ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్లు- డిస్కౌంట్, పాత విధానంలో
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపు దారులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తిపన్ను వసూళ్లను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీని అమలు వల్ల అటు ప్రజలపై భారం తగ్గడంతో పాటు పన్ను వసూళ్లు కూడా పెరగబోతున్నాయి. తాజాగా పురపాలక ఎన్నికల సందర్భంగా ఆస్తిపన్ను భారం పెరుగుతుందంటూ విపక్షాలు చేసిన ఆరోపణలన్ని తిప్పికొట్టిన ప్రభుత్వం ఊహించినట్లుగానే పాత బకాయిలను క్లియర్ చేస్తూ కొత్త విధానానికి త్వరలో శ్రీకారం చుట్టబోతోంది.
ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్న్యూస్
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం రెండు గుడ్న్యూస్లు చెప్పింది. ఇందులో ప్రధానమైనది ఇళ్ల రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పన్ను వసూలు చేయాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమైతే, రెండవది ఆస్తిపన్ను చెల్లింపులపై డిస్కౌంట్ ఇవ్వడం. ఈ రెండు నిర్ణయాల ఆధారంగా ఏప్రిల్లో భారీగా పన్ను వసూళ్ల రాబడి పెంచుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ప్రజల కోణంలో చూసినప్పుడు కూడా ఈ రెండు నిర్ణయాలు ఊరట కలిగించేలా ఉండటంతో ఎక్కువ మంది ఏప్రిల్లో ఏప్రిల్ పన్ను చెల్లింపుకు ముందుకు రావొచ్చని తెలుస్తోంది.
అసెస్మెంట్ విలువ ఆధారంగానే పన్ను
గతేడాది ఏపీలో ఆస్తిపన్ను వసూళ్లను ఆయా స్ధలాలు, భవనాల ఆస్తి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పన్ను వసూలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న అద్దె విలువ ఆధారిత పన్నుకు బదులు రిజిస్ట్ర్రేషన్ విలువ ఆధారిత పన్ను కోసం ఈ ఆర్డినెన్స్ తెచ్చింది. అయితే వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు ఈ ఏప్రిల్ నుంచి ఆస్తుల విలువను రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ లెక్కించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో మాత్రం ఆస్తుల అసెస్మెంట్ విలువ ఆధారంగా అంటే అద్దె విలువ ఆధారంగానే పన్ను వసూలు చేయాలని పేర్కొంది దీంతో రిజిస్ట్రేషన్ ఆధారిత పన్ను వసూలుపై వచ్చిన విమర్శలకు ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్లో చెల్లిస్తే ఐదు శాతం డిస్కౌంట్
కొత్త ఆర్ధిక సంవత్సరం 2021-22లో వసూలు చేసే పన్నును ఏప్రిల్లో చెల్లించే వారికి కూడా ప్రభుత్వం భారీగా ఊరటనిచ్చింది. మొత్తం పన్నుపై ఐదుశాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. అంటే వచ్చే ఆర్ధిక సంవత్సరానికి పన్నును ఏప్రిల్లో చెల్లిస్తే ఐదు శాతం డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది. దీంతో వారు స్ధానికంగా ఇవే ఉత్తర్వులను జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఏప్రిల్లో డిస్కౌంట్ ద్వారా భారీగా పన్ను వసూలు చేసుకోవాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రజల్ని ఊరించేందుకు ఈ రెండు ఆఫర్లు ఇచ్చినట్లు అర్ధమవుతోంది.