ఏపీ పరిషత్ పోరుకు ఏర్పాట్లు- ఏప్రిల్ రెండో వారంలోనే- ఆగిన చోట నుంచే
ఏపీలో గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు వైసీపీ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది. ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలు నిర్వహిచేందుకు చివరి నిమిషం వరకూ ప్రయత్నించినా ఆయన ఒప్పుకోకపోవడంతో ఈ నెలలో జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో వచ్చే నెల 1వ తేదీన బాధ్యతలు చేపట్టనున్న కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నీ ఆధ్వర్యంలో పరిషత్ పోరు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఏపీలో పరిషత్ పోరుకు సన్నాహాలు
ఏపీలో గతేడాది వాయిదా పడిన పరిషత్ పోరును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు వైసీపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం త్వరలో కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నీ బాధ్యతలు చేపట్టగానే నోటిఫికేషన్ ఇప్పించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే నోటిఫికేషన్ ఇచ్చే క్రమంలో గతంలో వాయిదా పడిన దగ్గరి నుంచే నిర్వహిస్తారా లేక కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది.
ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఏప్రిల్ రెండో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పరిషత్ పోరును సాధ్యమైనంత త్వరగా ముగించేస్తే ఆ తర్వాత పాలనపై దృష్టిపెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లెక్కన ఏప్రిల్ మొదటివారంలో నోటిఫికేషన్ ఇస్తే రెండో వారానికి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో ఆగిన చోట నుంచి నిర్వహిస్తే ఏకగ్రీవాలు మినహా మిగిలిన స్ధానాలకు ఎన్నికలు ఉంటాయి. అలా కాదని కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తే ఇంకాస్త ఆలస్యం కావొచ్చు.
ఆగిన చోట నుంచి వద్దంటున్న విపక్షాలు
గతేడాది కరోనా కారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అయితే అప్పటికే పలు స్ధానాలు ఏకగ్రీవం అయిపోయాయి. వీటిలో ఏవైనా అక్రమాలు జరిగాయోమో అన్న అనుమానంతో విచారణకు ఆదేశించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఏకగ్రీవమైన అభ్యర్ధులకు ఫామ్ 10 ఇవ్వకుండా ఆపారు. కానీ హైకోర్టు ఆదేశాలతో ఫామ్ 10 ఇవ్వక తప్పలేదు. అంటే అప్పట్లో ఏకగ్రీవాలకు ఆమోదముద్ర పడినట్లే. అయితే ఎన్నికలు రద్దయి కొత్త నోటిఫికేషన్ వస్తే మాత్రం ఈ ఏకగ్రీవాలను కూడా రద్దు చేయాలి. విపక్షాలు కూడా ఇదే కోరుకుంటున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆగిన చోట నుంచే ఎన్నికలకు మొగ్గు చూపుతోంది.