ప్రజాధనం దుర్వినియోగం అవుతోందా?: బాబు ఫాంహౌస్కు నిధులు
హైదరాబాద్: నగరంలోని మదీనగూడలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫాంహౌస్కు అదనపు హంగుల కోసం ప్రభుత్వం రూ.1.36 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో అత్యవసరంగా నామినేషన్పై పనులు చేపట్టాలంటూ రోడ్లు, భవనాలశాఖ శుక్రవారం జీవో నంబరు 181 జారీ చేసింది.
అంతేకాదు తెలంగాణలో సీఎం క్యాంపు నివాసంగా పేర్కొంటూ అందులో భద్రత, ఇతర సౌకర్యాల కల్పనకు నిధులు విడుదల చేసినట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. వివరాల్లోకి వెళితే... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు మదీనగూడలో ఓ ఫాంహౌస్ ఉంది.
జూబ్లీహిల్స్లోని తన సొంతింటిని కూల్చేసి, కొత్త ఇల్లు కట్టుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు కుటుంబం ఈ ఫాంహౌస్లోనే నివాసముంటోంది. ఈ ఫాంహౌస్ను సీఎం క్యాంప్ ఆఫీస్గా పేర్కొన్న ఆర్ అండ్ బీ శాఖ హెలిప్యాడ్, అప్రోచ్రోడ్డు కోసం రూ.9.80 లక్షలు కేటాయించింది.
దీంతో పాటు ఫాంహౌస్ లోపల సర్వీస్ రోడ్డుకు 9.50 లక్షలు, బోర్వెల్, నీటిసరఫరా ఏర్పాట్లకు రూ.8.40 లక్షలు కేటాయించారు. ఇక పోలీస్ పికెట్, సెంట్రీ పోస్టుల ఏర్పాటు, భద్రతా సిబ్బందికి ఈశాన్య, నైరుతి మార్గాల్లోని గేట్ల వద్ద పోలీస్ బ్యారెక్స్ తదితరాలకోసం వేర్వేరుగా నిధులు కేటాయించారు.
ఇలా చంద్రబాబు నాయుడు ఫాంహౌస్లో అదనపు హంగులకోసం ఆర్థిక సంవత్సరం తొలి రోజే రూ.1.36 కోట్లు కేటాయించడం అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతక ముందు జూబ్లీహిల్స్లో తన సొంతింటిని ఖాళీ చేసిన తర్వాత దానికి సమీపంలోనే వేరొక ఇంట్లో కొంతకాలం నివాసం ఉన్నారు.
దాంతో అక్కడ సీఎం అధికారిక నివాసానికి అదనపు సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్ల పేరుతో అప్పట్లో కోట్లాది రూపాయలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా ఇప్పుడు మదీనగూడలోని ఫాంహౌస్ను క్యాంప్ రెసిడెన్స్గా పేర్కొంటూ నిధులను విడుదల చేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.