ఏపీలో బియ్యానికి బదులు నగదు బదిలీ-సర్వేకు తాత్కాలిక బ్రేక్
ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్ధ ద్వారా ఇస్తున్న బియ్యం స్ధానంలో నేరుగా నగదు బదిలీ చేసేలా ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మంత్రులతో పాటు అధికారులు కూడా ప్రకటనలు చేశారు. దీనిపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు లబ్దిదారుల్ని సర్వే కూడా చేస్తున్నారు.
ఏపీలో ఏపీలో బియ్యానికి బదులు నగదు బదిలీ కోసం నిర్వహిస్తున్న సర్వేకు తాత్కాలిక బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.బియ్యానికి బదులు నగదు బదిలీ చేసేందుకు వీలుగా లబ్దిదారుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా అంగీకారం తెలిపిన లబ్దిదారులకు మాత్రమే నగదుబదిలీ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చేపట్టిన సర్వేను వివిధ కారణాలతో ప్రభుత్వం తాత్కాలికంగా ఆపేసినట్లు సమాచారం. అయితే సర్వే చేపడుతున్న సిబ్బందికి శిక్షణ మాత్రం కొనసాగించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ప్రజల నుంచి అంగీకార పత్రాలు తీసుకుని, వారికి మాత్రమే నగదు బదిలీ చేయాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పుడు ప్రజల నుంచి అంగీకార పత్రాలు సేకరించవద్దని ఆదేశాలు ఇస్తోంది. తొలిరోజు సర్వే ప్రారంభమైన కొద్దిసేపటికే ఆదేశాలు వెలువడటం విశేషం. అయితే సర్వే సిబ్బందికి మాత్రం శిక్షణ కొనసాగనుంది. వాస్తవానికి ఈ సర్వేను నెలాఖరు కల్లా పూర్తి చేసి మే1 నుంచి బియ్యంకు బదులు నగదు బదిలీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే నగదు బదిలీలో ఇబ్బందులు ఎదురుకావడం లేదా సాంకేతిక సమస్యలతో ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.