ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వారాంతపు సెలవుల్లో మెలిక ఉందా? పోలీసులు నష్టపోతున్నారా..?
అమరావతి : 24 గంటల డ్యూటీ. వారంలో ఏడు రోజులు విధుల్లో ఉండాల్సిందే. బయట అడుగుపెడితే మళ్లీ ఇంటికి చేరేదెప్పుడో తెలియదు. ఇంతటి ఒత్తిళ్ల మధ్య ఉద్యోగం చేస్తున్న పోలీసులకు ఈ మధ్యే ఓ గుడ్ న్యూస్ అందింది. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి అమలు చేసింది. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. వీక్లీ ఆఫ్లు ఇస్తున్న ప్రభుత్వం అందులో ఓ మెలికపెట్టింది. సరెండర్ లీవులు క్యాన్సిల్ చేస్తామని ప్రకటించి పోలీసులకు షాక్ ఇచ్చింది.
సరెండర్ లీవ్లకు ఎసరు
రాత్రి పగలన్న తేడా లేకుండా డ్యూటీలు చేస్తున్న పోలీసులకు ఇప్పటి వరకు నెలన్నర రోజుల సరెండర్ లీవ్లు ఉండేవి. అంటే 45 రోజుల సెలవులను సరెండర్ చేసి అందుకు ప్రతిఫలంగా జీతం అందుకునే వారు. అయితే ప్రస్తుతం వీక్లీ ఆఫ్ ఇస్తున్నందున సరెండర్ లీవ్ జీతం ఎందుకు ఇవ్వాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. సరెండర్ లీవ్లకు ఎసరు పెడితే పోలీసులు వారి హోదాను బట్టి రూ.50వేల నుంచి లక్ష రూపాయల వరకు నష్టపోయే అవకాశముంది. సరెండర్ లీవ్ల రద్దుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు విడుదల కానప్పటికీ ఇకపై నెలన్నర జీతం వచ్చే అవకాశం లేదని యూనిట్ ఆఫీసర్లు సిబ్బందికి మౌఖికంగా చెబుతున్నారు. దీంతో సిబ్బందిలో ఆందోళన నెలకొంది.
ఎప్పుడు పిలిచినా డ్యూటీకి
టెక్నికల్గా చూస్తే అన్ని జిల్లాల్లో పోలీసులకు వారాంతపు సెలవులు అమలు చేస్తున్నా ఎప్పుడు పిలిచినా డ్యూటీకి రావాలన్న నిబంధన పెట్టారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో వారాంతపు సెలవులు అమలు కావడం లేదు. పూర్తిస్థాయిలో వీక్లీ ఆఫ్ విధానం అమలు చేయాలంటే అదనపు సిబ్బంది నియామకం చేపట్టాలి. రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు వారాంతపు సెలవుల్ని అమలు చేసినా పోలీసులకు పని ఒత్తిడి తగ్గే అవకాశం లేదు. కొత్తవారని నియమించి వీక్లీ ఆఫ్లను పూర్తి స్థాయిలో అమలు చేసిన తర్వాత సరెండర్ లీవులు రద్దు చేస్తే అభ్యంతరం ఉండదని పలువురు పోలీసులు అంటున్నారు.
నిర్ణయం తీసుకోలేదన్న అధికారులు
వీక్లీ ఆఫ్ల కారణంగా సరెండర్ లీవుల్ని రద్దు చేయాలన్న అంశం ఇంకా చర్చల స్థాయిలోనే ఉందని అధికారులు అంటున్నారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. అయితే యూనిట్ స్థాయి అధికారులు మాత్రం త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని అంటున్నారు. ప్రస్తుతం ఏ ఇద్దరు పోలీసులు కలిసినా ఇదే అంశంపై చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరెండర్ లీవుల రద్దు అంశంపై నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్పెషల్ అలవెన్సుల రద్దు?
సరెండర్ లీవులతో పాటు పోలీసులకు ఇచ్చే ప్రత్యేక అలవెన్సులు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఐడీ, సీసీఎస్, ఏపీఎస్పీ, ఏఆర్, ఏసీబీ తదితర విభాగాల సిబ్బందికి 30 నుంచి 60శాతం అలవెన్సులు ఇస్తున్నారు. వీటన్నింటితో పాటు ట్రావెల్ అలవెన్సును కూడా రద్దు చేస్తారని వార్తలు వస్తుండటంతో ఆయా యూనిట్ల సిబ్బంది మరింత ఆందోళనకు గురవుతున్నారు.