కోవిడ్పై జగన్ ప్లాన్ బీ- ఆస్పత్రుల సంఖ్య రెట్టింపు- జీతాల పెంపు- అనవసర రిఫరల్స్పై చర్యలు...
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో వైరస్ నియంత్రణకు మరింత కట్టుదిట్టంగా ముందుకెళ్లాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఇందుకోసం ప్లాన్ బీ అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రుల సంఖ్యను భారీగా పెంచడంతో పాటు రోగులకు అందుతున్న సేవలపై పర్యవేక్షణ మరింత పెరిగేలా జగన్ ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ఊన్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను కూడా పెంచాలని జగన్ నిర్ణయించారు. ఆస్పత్రులకు అనవసరంగా రిఫర్ చేస్తున్న ఘటనలపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.
కరోనా ఆస్పత్రులు రెట్టింపు...
ఏపీలో కరోనా నియంత్రణ కోసం ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మారుతున్న పరిస్ధితుల్లో వాటి సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా చర్యల్లో 138 ఆస్పత్రులు పాలుపంచుకుంటుండగా.. దీన్ని 287కు పెంచబోతున్నారు. ఆస్పత్రుల సంఖ్య పెంపుతో సరిపెట్టకుండా వాటిలో సౌకర్యాలు, వాటిపై నిఘా కూడా పెంచాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా కల్లోలం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల విషయంలో పకడ్బందీ చర్యలుండాలని సీఎం అధికారులకు సూచించారు.
అన్ని కోవిడ్ ఆస్పత్రులలో పూర్తి స్థాయిలో వైద్యులు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని, రోగులకు ప్రతి చోటా సంతృప్తికర స్థాయిలో సేవలు అందాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.
కోవిడ్ ఆస్పత్రులకు రేటింగ్...
ప్రస్తుతం కోవిడ్ ఆస్పత్రుల్లో అందిస్తున్న సేవలపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో వీటితో పాటు కొ్త్తగా నెలకొల్పే ఆస్పత్రులను కూడా కలుపుకుని త్వరలో రేటింగ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలకు అనుగుణంగా వాటికి రేటింగ్ ఇవ్వనున్నారు. ఆస్పత్రుల్లో ప్రమాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను జగన్ ఆదేశించారు. ముఖ్యంగా కోవిడ్ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం విషయంలో అసలు రాజీపడొద్దని జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇందుకోసం కోవిడ్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు కూడా పెంచాలని జగన్ సూచించారు.
త్వరలో నియామకాలు...
కరోనాతో ఆస్పత్రులకు వస్తున్న రోగులకు సరైన సమాచారం అందించాల్సిన అవసరాన్ని కూడా సీఎం జగన్ తాజా సమీక్షలో ప్రత్యేకంగా గుర్తుచేశారు. ఇందుకోసం తాజాగా అందుబాటులోకి తెస్తున్న ఆస్పత్రులతో పాటు ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల్లోనూ సిబ్బంది సంఖ్యను తెలుసుకుంటూ కొత్తగా కేటాయించిన ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయాలని జగన్ ఆదేశించారు. చికిత్స పొందుతున్న వారికి మంచి భోజనం అందించాలని సూచించారు. అదే సమయంలో కోవిడ్ తో ఆస్పత్రులకు వచ్చే వారికి మందులు ఇవ్వడం, చికిత్స అందించడంతో పాటు, వారి సందేహాలకు ఎప్పటికప్పుడు సమాధానాలు ఇచ్చే వ్యవస్థ సక్రమంగా ఉండాలని సీఎం సూచించారు. ఇవే కాకుండా కోవిడ్ వస్తే ఏం చేయాలి? ఎవరికి ఫోన్ చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? ఎవరిని కలవాలి? అన్న వాటిపై బాగా ప్రచారం చేయాలన్నారు.
Recommended Video
అనవసర రిఫరల్స్పై సీరియస్..
రాష్ట్రంలో పలు చోట్ల కరోనా బాధితులు రాగానే వారిని పెద్దాసుపత్రులకు రిఫర్ చేయడం బాగా పెరిగింది. దీంతో కోవిడ్ ఆస్పత్రులపై భారం మరింత పెరుగుతోంది. దీంతో ఇకపై విలేజ్, వార్డు క్లినిక్స్ నుంచి రిఫరల్ ప్రోటోకాల్ తప్పనిసరిగా అమలు చేయాలని సీఎం జగన్ సూచించారు. ఇకపై స్ధానికంగా పరీక్షించకుండా అనవసరంగా ఆస్పత్రులకు రిఫర్ చేసినా కఠిన చర్యలు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్లు మరింత చురుగ్గా పనిచేయాలని, వీటిపై పిర్యాదులు రాకుండా చూసుకోవాలని అధికారులకు జగన్ సూచించారు. ప్రస్తుతం ప్లాస్మాథెరపీతో పాటు అన్ని చికిత్సలు సమగ్రంగా చేస్తున్నామని, దీంతో మన రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉందని అధికారులు జగన్ దృష్టికి తెచ్చారు.