APFRS : ఏపీ ఉద్యోగుల ఫేస్ అటెండెన్స్ యాప్-ఈ ఆప్షన్ పెడితే వీరికి మినహాయింపు !
ఏపీలో ఉద్యోగుల ముఖ ఆథారిత హాజరు యాప్ ఏపీఎఫ్ఆర్ఎస్ లో ఇంకా నమోదు చేసుకోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల పీఎస్, పీఏలకు జీఏడీ తాజాగా మెమో పంపింది.
ఏపీలో ఉద్యోగుల ముఖ ఆథారిత హాజరు యాప్ ఏపీఎఫ్ఆర్ఎస్ లో వందశాతం నమోదుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి అక్కడక్కడా ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఈ యాప్ లో వందశాతం ఉద్యోగుల్ని నమోదు చేయించాలని ఇప్పటికే శాఖాధిపతులకు ప్రభుత్వం గతంలోనే సర్కులర్ పంపింది. దీని ప్రకారం తమ పరిధిలోకి వచ్చే వారందరికీ ఈ యాప్ లో నమోదు చేయించాలని ఆదేశించింది. అయినా ఇంకా ఈ యాప్ లో వందశాతం ఉద్యోగులు నమోదు కాలేదు.
ఈ నేపథ్యంలో ఇంకా ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ లో రిజిస్టర్ చేసుకోని ఉద్యోగులపై ఆరా తీస్తున్నారు. దీంతో ఈ యాప్ లో రిజిస్టర్ కాని ప్రజాప్రతినిధులు పీఎ, పీఎస్, ఓఎస్డీ, అదనపు పీఎస్ లు ప్రభుత్వానికి తాజాగా ఓ వినతి పత్రం ఇచ్చారు. తాము ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల వెంట తిరుగుతున్న తరుణంంలో ఈ యాప్ ద్వారా హాజరు నమోదు చేయడం సాధ్యం కాదని, అందుకే దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం మరో మెమో ఇచ్చింది.

ఇందులో ప్రజాప్రతినిధుల పీఎ, పీఎస్, ఓఎస్డీ, అదనపు పీఎస్ లు ఫేస్ యాప్ లోని టూర్/ఆన్ డ్యూటీ ఆప్షన్ వాడుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ ఆప్షన్ ద్వారా తమ హాజరు నమోదు చేసుకోవాలని వారిని కోరింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఆదేశాలు జారీ చేశారు. పీఎ, పీఎస్, ఓఎస్డీ, అదనపు పీఎస్ ల అసోసియేషన్ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ ఆప్షన్ వాడుకునే అవకాశం కల్పిస్తున్నామని, కాబట్టి వారంతా యాప్ లో రిజిస్టర్ కావాలని సూచించారు.












Click it and Unblock the Notifications