ఏపీలో ఇంటిపన్ను, నీటి పన్ను కట్టలేదా ? ఇక షాకులే..!
ఏపీలో ఎనిమిది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్గాలు వెతుకుతోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పెండింగ్ ఉన్న అన్ని పన్నుల్ని వసూలు చేసేసేందుకు సిద్దమవుతోంది. ఇందుకోసం ఓ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబోతోంది. ఇందులో అధికారులు ఏమేం చేయాలో పురపాలకశాఖ ఉన్నతాధికారులు ఇవాళ కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు.
మున్సిపాలిటీల్లో పెండింగ్ పన్నుల వసూళ్లపై అధికారులతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సమీక్షించారు. ఇందులో ఆయన రాష్ట్రంలో పెండింగ్ పన్నులపై అధికారులను అడిగి వివరాలు తీసుకున్నారు. అనంతరం వాటి వసూళ్లకు ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని వారిని ఆదేశించారు. ఈ మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు.
మున్సిపాలిటీల్లో పన్నుల బకాయిల వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని వారికి తెలిపారు.

ఆస్తి పన్ను,ఖాళీ స్థలాల పన్ను వసూళ్లు తక్కువగా ఉండటంతో మున్సిపాలిటీలకు భారీగా ఆదాయం లోటు ఏర్పడిందని సురేశ్ కుమార్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్లు పన్నులు చెల్లించని ఖాళీ భూముల యజమానులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీ లో పెండింగ్ పన్నుల జాబితా ప్రకటించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అత్యధిక పన్ను వసూలు చేసిన మున్సిపల్ కమిషనర్లకు నగదు పురస్కారాలు,ఇతర ప్రోత్సాహకాలు అందిస్తామని ఆయన తెలిపారు. దీంతో త్వరలోనే ఈ స్పెషల్ డ్రైవ్ ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications