కిలో ఉల్లి రూ.32కే.. వచ్చే వారం నుంచే పంపిణీ
నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు ఏపీ సర్కారు చర్యలు చేపట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఏపీలో కిలో ఉల్లిపాయలు రూ.32కే ప్రభుత్వం అందించనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. వచ్చేవారం నుంచి 115 రైతు బజార్లలో విక్రయించనున్నట్లు తెలిపారు. మొబైల్ కౌంటర్ల ద్వారా కూడా సరఫరా చేస్తామన్నారు. 4-5 నెలలు రేషన్తోపాటు కిలో కందిపప్పును మార్కెట్ ధర కంటే 25-30 శాతం తక్కువకు విక్రయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీలో ప్రకటించారు. 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కంది సేకరణకు కేంద్రం సహకారం అందించనున్నట్లు తెలిపారు.
పామాయిల్ ధరల నియంత్రణకూ కేంద్రంతో చర్చలు జరుపుతామని, పీడీఎస్ బియ్యంలో నూకల శాతాన్ని తగ్గిస్తామని వెల్లడించారు. పీడీఎస్ బియ్యంలో 25 శాతం నూకల స్థానంలో 10 శాతం నూకలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. అలాగే త్వరలోనే పామాయిల్ నూనెను కూడా రీజనబుల్ ధరకే అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ పంపిణీ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల ద్వారా నిర్వహించనున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యంతో పాటు పచ్చిశనగలు, పంచదారను కూడా నిరంతరం సరఫరా చేస్తున్నామన్నారు.

మరోవైపు అక్టోబర్ 1వ తేదీ కల్లా రాష్ట్రవ్యాప్తంగా 1000 'మీ మార్ట్' కేంద్రాలను ఏర్పాటు చేయడానికి జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య(ఎన్సీసీఎఫ్)తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పటివరకు 870 షాపులు సిద్ధమయ్యాయని.. మరో 130 షాపులను కూడా వేగంగా పూర్తి చేసి అక్టోబర్ 1వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 1000 మీ మార్టులను ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రముఖ సూపర్ మార్కెట్ 'డీ మార్ట్'లకు దీటుగా ఈ 'మీ మార్ట్'ల ద్వారా 64 రకాల నిత్యావసర వస్తువులను తక్కువ పరిమాణంలో కూడా సామాన్యులకు తక్కువ ధరలకే లభించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆ తర్వాత వాటిని మరింత విస్తరిస్తామని మంత్రి వెల్లడించారు.
ధాన్యం విక్రయించిన రైతులకు 24 గంటల్లోనే ధాన్యం చెల్లింపులు కొనసాగుతాయని ఆయన తెలిపారు. 37-38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎల్పీజీ రీబుకింగ్ కు 25 రోజుల గ్యాప్ అమల్లోకి రానుందని మంత్రి తెలిపారు. మరోవైపు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీని మంత్రి నాదెండ్ల స్వాగతించారు.














Click it and Unblock the Notifications
