ఈ వైపున జగన్.. ఆ వైపు నుంచి ఢీ కొట్టేదెవరు: శిలువ..మసీదు తప్ప: సీఎం ధీమా అదే: సజ్జల
అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలోని అన్ని హామీలను తమ ప్రభుత్వం అమలు చేసిందని ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన హామీలు ఆషామాషీవి కాదని, వాటిని అత్యంత పకడ్బందీగా అమలు చేయడానికి రూపొందించిన వలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాలు ఉన్నాయని చెప్పారు. 1.16 లక్షల కోట్ల రూపాయలను నేరుగా పేదల ఖాతాల్లోకి చెల్లించామని, ఈ ఘనత ఒక్క వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కిందని పేర్కొన్నారు. అధికార పార్టీని సమర్థవంతంగా ఢీ కొట్టే ప్రతిపక్షం లేదని చెప్పారు. ఈ వైపున వైఎస్ జగన్ ఉన్నారని, అటు వైపు ఎవరున్నారని ప్రశ్నించారు.

పావలా పని..వంద ప్రచారం
కొద్దిసేపటి కిందటే ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎక్కడే గానీ.. రెడ్ టేపిజం, కుల, మత, ప్రాంతాలు, పార్టీలను చూడకుండా.. ఒక్క రూపాయి కూడా లంచాన్ని ఇవ్వకుండా సంక్షేమ పథకాలను అమలు చేశామని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఒక క్యాలెండర్ ప్రకారం- ప్రభుత్వం తన పనిని తాను చేసుకుంటూ పోతోందని అన్నారు. ఇదివరకు పని చేసిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం.. పావలా పని చేసి, వంద రూపాయల ప్రచారం చేసుకునేదని విమర్శించారు. పేద ప్రజల ముఖాల్లో చిరునవ్వును చూస్తున్నామని, వారిలో ప్రభుత్వం ఆత్మవిశ్వాసాన్ని కల్పించిందని అన్నారు.

ప్రజలే ప్రచారకర్తలు..
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజలు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తారని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడాలని వైఎస్ జగన్ భావిస్తున్నారని చెప్పారు. ప్రజల నుంచి ఎలాంటి ఫలితాలను ఆశించకుండానే ఆయన అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్నారని పేర్కొన్నారు. ఎన్నికలు ఆరునెలలు ఉన్నాయనగా సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రభుత్వాలను తాము చూశామని, వైఎస్ జగన్ అలాంటి ప్రయోజనాలను ఆశించకుండా పని చేస్తోన్నారని అన్నారు.

జగన్ ధీమా అదే..
ప్రజల్లో నెలకొన్న సంతోషాలు, వారి ముఖాల్లో కనిపిస్తోన్న చిరునవ్వు, వారి ఆత్మ విశ్వాసమే.. తమ పార్టీని గెలిపిస్తుందనే ధీమా వైఎస్ జగన్లో ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రజల గురించి ఏ రాజకీయ పార్టీ కూడా పోరాటం చేయలేని విధంగా- వారి అవసరాలను తీర్చుతున్నారని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే- ప్రజలతో సంబంధం లేని జిన్నా టవర్, కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరు మార్పు.. వంటి అంశాలను ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని అన్నారు.

శిలువ.. మసీదు తప్ప
ప్రజలకు సంబంధించిన సమస్యల అజెండాతో ప్రభుత్వాన్ని నిలదీయాలా? లేక మతమే ప్రధానంగా తీసుకుని ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలా అనే విషయాల మీద ప్రతిపక్షాలు తేల్చుకోలేకపోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తోంటే- శిలువ, మసీదు తప్ప మరేది వారికి కనిపించట్లేదని చెప్పారు. జిన్నా టవర్, కింగ్ జార్జ్ పేర్లు ఎప్పుడు చరిత్రతో ముడిపడి ఉన్నవని పేర్కొన్నారు. తమ వైఖరిని మార్చుకోక తప్పదని పేర్కొన్నారు.

మహిళలకే ప్రాధాన్యత..
సామాజికంగా వైఎస్ జగన్ మహిళలకు అత్యధికక ప్రాధాన్యత ఇస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇంటి యజమాని అనే పేరుకు బదులుగా ఇంటి యజమానురాలు అనేది ఒక్క ఏపీలో మాత్రమే కనిపిస్తోందని చెప్పారు. ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీదే ఇవ్వడం దేశంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు. 32 లక్షల నివాసాలను మహిళల పేరు మీద, అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నర సంవత్సరాల్లోనే అప్పగించామని అన్నారు.

అజెండా ఫిక్స్..
ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు పోకుండా.. చెప్పినవన్నీ చేస్తూ, రాజకీయాల్లో ఓ సమూల మార్పునకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని, దాని ఫలితాలు ఈ రెండున్నరేళ్లలో చూస్తున్నామని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఇంతకంటే బెటర్గా వస్తేనే ప్రజలు మరో పార్టీ వైపు చూస్తారని అన్నారు. అలాంటి అజెండాను వైఎస్ జగన్ ఫిక్స్ చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు తనకు తెలిసిన పాత సాము గారడీలను ప్రజలు పట్టించుకోరని తేల్చేశారు. అలాంటి వాటికి కాలం చెల్లిందని అన్నారు.












Click it and Unblock the Notifications