రైతులకు ఏపీ ప్రభుత్వ 90 శాతం రాయితీ.. నెలాఖరు వరకు గడువు
అభివృద్ధితోపాటు సంక్షేమాన్ని కూడా సమానంగా చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే తన పనితీరు ఉండేలా చూసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం కింద వ్యవసాయం చేసే రైతులకు రాయితీని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా వారికి అవసరమైన పనిముట్లు, విత్తనాలను రాయితీపై అందిస్తోంది. తుంపర సేద్యంతోపాటు బిందు సేద్యం చేసే రైతులకు అవసరమైన పరికరాలను వెంటనే అందజేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల క్రితమే కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు.
70 నుంచి 90 శాతం రాయితీ
తాజాగా ఆయా కంపెనీలన్నీ పరికరాలను అందుబాటులోకి తేవడంతో వీటిని అన్నదాతలకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు 70 నుంచి 90 శాతం వరకు రాయితీ అందుతోంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెలాఖరు వరకు సమయం ఇచ్చారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని ఏపీఎంఐపీ ప్రాజెక్టు అధికారులకు ప్రత్యేక ప్రణాళికలను ప్రభుత్వం పంపించింది. గుంటూరు లోని ఉద్యానశాఖ ప్రధాన కార్యాలయ సంచాలకుల నుంచి ఈ సమాచారం అందింది. 15వేల హెక్టార్లలో రూ.135 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్ చేస్తుండగా, అందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.74 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.49 కోట్లు, అన్నదాతల వాటా రూ.14 కోట్ల వరకు ఉంది.

స్ప్రింకర్లపై 55 శాతం రాయితీ
ఐదు ఎకరాల్లోపు రైతులకు 90 శాతం రాయితీ అందుతుండగా, ఐదెకరాల నుంచి 10 ఎకరాల్లోపు అన్నదాతలకు 70 శాతం రాయితీపై పరికరాలను అందజేస్తారు. వీటితోపాటు స్ప్రింక్లర్లపై 55% రాయితీ (ఐదెకరాల్లోపు), 45% (5 నుంచి 12 ఎకరాల్లోపు) రాయితీ అందజేస్తున్నారు. ఆసక్తి ఉన్న రైతులు ఏపీఎంఐపీ కార్యాలయానికి చెందిన 63036 13097, 08518 279724 నెంబర్లలో సంప్రదించాలని అధికారులు కోరారు. రైతులకు ఏమైనా సందేహాలుంటే సమీపంలోని రైతు భరోసా కేంద్రాల్లోని అధికారులను, సిబ్బందిని సంప్రదించాలన్నారు. ఈనెలాఖరుకల్లా పథకానికి దరఖాస్తు చేసుకునే గడువు ముగుస్తోందని, రైతులు వెంటనే వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications