పీఆర్సీపై నేడే ఫైనల్ - ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం : ఆ వెంటనే సీఎంతో భేటీ..!!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు..పెన్షనర్లకు న్యూ ఇయర్ గుడ్ న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరింత ఆలస్యం చేయకుండా పీఆర్సీ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం చర్చలకు రావాలంటూ ఏపీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఆర్దిక శాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన పీఆర్సీ పైన ఈ సమావేశం జరుగుతుందని ప్రభుత్వం నుంచి అందిన ఆహ్వానంలో పేర్కొన్నారు. మొత్తం 16 సంఘాలతో మూడు గ్రూపులుగా.. సమయం కేటాయించారు. సచివాలయంలో ఈ సమావేశంలో జరగనుంది.

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కు ఆహ్వానం
కేవలం ఆర్దిక శాఖ అధికారులతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయటం ద్వారా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న విధంగా 1600 కోట్ల రూపాయల బకాయిలతో పాటుగా.. పీఆర్సీ ఫిట్ మెంట్ పైన ఉద్యోగ సంఘాల నుంచి ఒక నిర్దిష్ఠ ప్రతిపాదన పైన అధికారులు క్లారిటీ తీసుకోనున్నారు. మొత్తం 16 సంఘాల నేతలకు ఏపీలో ప్రస్తుతం ఉన్న ఆర్దిక పరిస్థితిని వివరిస్తూ... 27 శాతం ఐఆర్ ఇస్తున్న నేపథ్యంలో అంతకంటే కొంత పెంచి ఫిట్ మెంట్ గా ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాల ముందు వివరించి..ఫిట్ మెంట్ ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీని పైన మెజార్టీ ఉద్యోగ సంఘాల అభిప్రాయాల ను సీఎం ను అధికారులు నివేదించనునున్నారు.

ఆర్దిక శాఖ అధికారులతో సమావేశం
అయితే, మొత్తం ఆర్దిక పరమైన వ్యవహారాల పైనే ఈ రోజు అధికారులతో జరిగే చర్చల్లో ప్రస్తావనకు రానున్నాయి. మధ్నాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అధికారుల వద్ద చర్చలు జరగనున్నాయి. ఫిట్ మెంట్... బకాయిలు.. ఖరారు చేసిన ఫిట్ మెంట్ చెల్లింపు సమయం పైన ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే ఏ శాతం మేర ఫిట్ మెంట్ ఖరారు చేస్తే ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుందనే అంశం పైన సుదీర్ఘ కసరత్తు జరిగింది. అయితే, ఎక్కువ భారం పడకుండా... ఉద్యోగులను మెప్పించే విధంగా ఎంత మేర అమలు చేయగలమనే అంశం పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే.. ఈ రోజు జరిగే సమావేశాల్లో ఉద్యోగ సంఘాలను ఒప్పించే ప్రయత్నం జరగనుంది.

పీఆర్సీపై తుది చర్చలు
ఉద్యోగ సంఘాల తుది ప్రతిపాదలను అధికారులు సీఎంకు నివేదిస్తారు. దీంతో..ఈ సాయంత్రం లేదా రేపు (శుక్రవారం) ఉదయం ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నట్లు సమాచారం. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ పీఆర్సీ పైన తుది నిర్ణయం అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు సీఎంతో తమకు కలిసే అవకాశం ఏర్పాటు చేయాలని కోరుతూ వస్తున్నారు. అయితే, వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి పెంచిన పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది.

సీఎంతో భేటీ.. అధికారిక నిర్ణయం
కానీ, ఉద్యోగ సంఘాలు మాత్రం ఇప్పటికే నష్టపోయామని వెంటనే అమలు చేయమని కోరుతున్నాయి. మధ్యే మార్గంగా వచ్చే ఆర్దిక సంవత్సరం నుంచి కొత్త సిఫార్సులు అమలు పైన నిర్ణయం జరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ముందుగా అనుకున్న విధంగా ఈ రోజు అంతా పక్కగా జరిగితే.. ఈ రాత్రికి లేదా రేపు ఉదయం సీఎం వద్ద పీఆర్సీకి సంబంధించి కొత్త సంవత్సరం కానుకగా ఉద్యోగులకు ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో..రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా ఈ రోజు జరిగే సమావేశం పైన ఆసక్తితో ఉన్నారు.












Click it and Unblock the Notifications