ఏ ఉద్యోగాలు తీసేయటం లేదు : చంద్రబాబు బంధువు ఉద్యోగాలు అమ్ముకున్నారు: సీఎం ఆగ్రహం..!
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజున అధికార..ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. ఔట్సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో టీడీపీ సభ్యులు రాద్దాంతం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభలో పచ్చి అబద్ధాలు చెప్తోందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు హాయంలో ఆయన బంధువు భాస్కర నాయుడు అమ్ముకున్నారని..ఆయన వివరాలు కూడా చెప్పమంటారా అని ప్రశ్నించారు. అదే సమయంలో ప్రభుత్వం తరపున సమాధానం ఇచ్చిన మంత్రి కన్నబాబు ప్రభుత్వం ఏ కాంట్రాక్టు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని తొలిగించటం లేదని స్పష్టం చేసారు.
ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు సస్పెన్షన్: కృష్ణకిశోర్ అంశంపై క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు: కక్షపూరిత చర్యగా.
అందుకోసమే..ఔట్సౌర్సింగ్ సర్సీసెస్
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేసే గొప్ప ఆలోచనతో ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్సౌర్సింగ్ సర్సీసెస్ను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. ఇప్పటివరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు పొందాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని.. ఆఖరికీ ఉద్యోగులు జీతాలు పొందాలన్న లంచం ఇవ్వాల్సి వస్తోందని వివరించారు. ఇలాంటి పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నష్టపోకూడదన సీఎం పేర్కొన్నారు. వారికి పూర్తి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్పొరేషన్ ఏర్పాటుచేసినట్టు సీఎం జగన్ వివరించారు.
చంద్రబాబు బంధువు అమ్ముకున్నారు..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన బంధువు భాస్కర్ నాయుడికి ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. ఆయన ఇస్టానుసారం ఉద్యోగాలు అమ్ముకున్నారని పేర్కొన్నారు. ఎలా అమ్ముకున్నారు..చంద్రబాబుతో లింకు ఏంటి చెప్పమంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు సంబంధించిన వాళ్లకే గత హయాంలో ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులు ఇచ్చి ఇష్టానుసారంగా దోచుకున్నారని మండిపడ్డారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చే సదుద్దేశంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్పొరేషన్ను తీసుకొచ్చామని, ఈ విషయంలోనూ టీడీపీ బురద జల్లుతూ.. రాజకీయం చేస్తూ.. దిక్కుమాలిన అబద్ధాలు చేస్తోందని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ ఉద్యోగం తీసేయటం లేదు
తమ ప్రభుత్వంలో పని చేస్తున్న ఏ కాంట్రాక్టు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగం తీసే ఉద్దేశం లేదని శాసనసభలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం కాంట్రాక్టు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల తొలిగింపు గురించి టీడీపీ నేతలు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. దీనికి మంత్రి కన్నబాబు సమాధానం ఇచ్చారు. ఈ ఉద్యోగాల నుండి ఎవరినీ తొలిగించే ఉద్దేశం లేదని..అవినీతికి ఆస్కారం లేకుండా చేసేందుకే ప్రభుత్వం కొత్తగా కార్పోరేషన్ అందుబాటులోకి తీసుకొచ్చిందని మంత్రి వివరించారు. దీని పైన టీడీపీ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయగా..ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని స్పష్టత ఇచ్చారు.