పీఆర్సీ పై వచ్చేవారం నిర్ణయం- ఏ మేర ఇస్తారో సంకేతాలు : సీఎం వద్దే ఫైనల్ కానుందా..!!
సుదీర్ఘ కాలం తరువాత జరిగిన 'జాయింట్ స్టాఫ్ కౌన్సిల్' సమావేశంలో ప్రభుత్వం పీఆర్సీ తో పాటుగా సీపీఎస్ రద్దు అంశాల పైన క్లారిటీ వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశించాయి. అయితే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ సిఫార్సులను వీలైనంత వరకూ పూర్తి సానుకూలంగా అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని స్పష్టం చేసారు. పీఆర్సీ సిఫార్సుల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై వచ్చే వారం పీఆర్సీ కమిటీ అధికారులతో సమావేశమై పూర్తిస్థాయిలో చర్చిస్తామన్నారు. పీఆర్సీ నివేదికను దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు.

వచ్చే వారం నిర్ణయం తీసుకుంటారా
ఇది ప్రాథమిక సమావేశం మాత్రమే. మరోసారి భేటీ అవుదాం. మీ డిమాండ్లు సీఎం దృష్టికి తీసుకెళ్తాం'' అని సమీర్ శర్మ హామీ ఇచ్చారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సుమారు రెండేళ్లుగా ఆశాజనకంగా లేవని, వాస్తవ పరిస్థితులను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ సంఘాలు తెలిపిన అంశాలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, ఫిట్మెంట్ 23 శాతం మాత్రమే ఇవ్వాలని పీఆర్సీ సిఫారసు చేసింది.

ఐఆర్ 27 శాతాన్నే ఫిట్మెంట్గా ఖరారు సంకేతాలు
ఇప్పటికే ఇస్తున్న ఐఆర్ 27 శాతాన్నే ఫిట్మెంట్గా ఖరారు అవుతుందనే సంకేతాలు తమకు 'జాయింట్ స్టాఫ్ కౌన్సిల్' సమావేశంలో సంకేతాలుగా కనిపించాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. పీఆర్సీ పెండింగ్లో ఉండగా... తాత్కాలిక ఉపశమనం కోసం ఐఆర్ ఇస్తారు. పీఆర్సీ దానికంటే ఎక్కువే ఉండాలి. కానీ... ఐఆర్నే ఫిట్మెంట్గా ఖాయం చేస్తామనడం ఎంతమాత్రం సరికాదని ఉద్యోగ సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ భేటీలో గుర్తింపు పొందిన 13 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఉద్యోగ సంఘాల హెచ్చరిక
పీఆర్సీపై వారం, పదిరోజుల్లో స్పష్టత ఇవ్వకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ అమరావతి చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని కంటితుడుపు చర్యగా ఏర్పాటు చేశారని ఆరోపించారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఏ అంశంపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని మండిపడ్డారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి, అమలు చేయాలని, సీపీఎస్ రద్దుపై తేల్చాలని, మిగిలిన ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశామన్నారు.

సీఎం జగన్ పైనే ఉద్యోగ సంఘాల ఆశలు
ఉద్యోగుల సమస్యలు వేటిపైనా ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. అయితే, ప్రభుత్వం ఆర్దిక సమస్యల కారణం గా ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్ నే పీఆర్సీ ఫిట్ మెంట్ గా ఖరారు చేయాలని నిర్ణయిస్తే..సీఎంతో సమావేశం కావాలని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. సీఎం ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తారని... ముందుగానే 27 ఐఆర్ ఇస్తామని ప్రకటించి..అమలు చేసారని..ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి తగ్గకుండా ఏపీలోనూ అమలు కావాలంటే సీఎం నిర్ణయంతోనే సాధ్యం అవుతుందని చెబుతున్నారు. దీంతో..ఈ నెలాఖరులోగా పీఆర్సీ పైన క్లారిటీ వస్తుందని భావించినా..ఇప్పుడు వచ్చే నెల తొలి వారంలో దీని పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications