కరోనా ఎఫెక్ట్ : కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలపై పూర్తిగా నిషేధం
ఏపీ రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలపై పూర్తిగా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి రానున్నాయి.
కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలు బంద్..
ఏపీలో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న గుంటూరు జిల్లాతో పొరుగు జిల్లాలకు సంబంధాలను క్రమంగా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలను పూర్తిగా నిషేధిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇరు జిల్లాల మధ్య ఉన్న సరిహద్దులను పూర్తిగా మూసేస్తున్నారు. రేపు ఉదయం కల్లా జాతీయ రహదారితో పాటు ఇతర మార్గాలూ మూసేయనున్నారు.

అత్యవసర సేవలకూ నో..

కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్ట్లు ఏర్పాటు
చేసిన పోలీసులు ఆ మేరకు నియంత్రణలు విధిస్తున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ వద్ద ఉన్న
పులిగడ్డ -పెనుమూడి వారథి వద్ద రెండు జిల్లాల గుండా ప్రయాణాలు చేస్తున్న వారిని పోలీసులు ఇవాళ అడ్డుకున్నారు. వీరికి ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని పోలీసులు తెలియజేస్తున్నారు.
అత్యవసర సేవల కోసం కూడా రెండు జిల్లాల మధ్య రాకపోకలను అధికారులు బంద్ చేశారు.
ఏ జిల్లా వాసులు ఆ జిల్లాల్లోనే ఉండాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగులను సైతం అనుమతించేది లేదని పోలీసులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications