ఏపీలో..ఇక 13 కాదు..25 జిల్లాలు: సీఎం మరో హామీ అమలు దిశగా: ముహూర్తం ఖరారు..!!
ఆంధ్రప్రదేశ్ కొత్త రూపు సంతరించుకోనుంది. 13 జిల్లాలుగా ఉన్న ఏపీ త్వరలో 25 జిల్లాలు కాబోతోంది. జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికార వికేంద్రీకరణలో తొలి అడుగు వేస్తున్నారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కో జిల్లాగా మారుస్తామని చెప్పిన జగన్..ఈ మేరకు నిర్ణయం దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సలహాదారులు ఈ విషయం పైన సమీక్షలు చేస్తున్నారు. తెలంగాణలో జిల్లాల పెంపు సమయంలో ఏ రకంగా వ్యవహరించారు..తరువాత అక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తాయనే అంశం పైన అధ్యయనం చేస్తున్నారు. దీని ద్వారా ఏపీ పాలనలో కొత్త ఒరవడికి.. వికేంద్రీకృత సేవలకు ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి నివేదించారు. కొత్త జిల్లాల ఏర్పాటు కు ముహూర్తం సైతం ఖరారు చేసారు. వచ్చే జనవరి 26న 25 జిల్లాల్లో జాతీయ జెండా ఆవిష్కరించేలా చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన. దీని ద్వారా ఏపీలో పాలనా వ్యవస్థ ప్రజలకు చేరువ కానుంది.

ఏపీలో కొత్త మరో 12 జిల్లాలు..
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ ఏపీలోని ప్రతీ పార్లమెంట్ స్థానాన్ని జిల్లాగా మారుస్తానని హామీ ఇచ్చారు. దీని ప్రకారం అధికారంలోకి వచ్చిన తరువాత కసరత్తు ప్రారంభించారు. వీటి ఏర్పాటుకు తాజాగా ముహూర్తం ఖరారు చేసారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేసి వచ్చే జనవరి 26 నుంచి కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు సైతం వివరించినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలని జగన్ గతంలోనే ప్రకటించారు. జిల్లాల పునర్విభజన పాలనలో కొత్త ఒరవడికి, వికేంద్రీకృత సేవలకు ఉపకరిస్తుందని పేర్కొన్నారని.. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు అందించే సేవలను మరింత దగ్గర చేసేందుకు ఆస్కారం ఉంటుందని జగన్ అంచనా వేస్తున్నారు.
ముఖ్యమంత్రి ఇదే విషయాన్ని గవర్నర్ కు సైతం వివరించినట్లు తెలుస్తోంది. దీనిపై గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఏపీలో అధికారం మొత్తం ఒకే చోట కాకుండా..వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలను సమానంగా పరిగణిస్తున్నామనే భావన ప్రజల్లో కలిగించటానికే ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన దిశా నిర్ధేశం చేసారు. త్వరలోనే దీని పైన అధికారిక ప్రక్రియ ప్రారంభం కానుంది.

కొత్తగా 12 జిల్లాలు..పేర్లు సైతం ఖరారు..!!
ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా కొత్తగా 12 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అందులో భాగంగా ఉత్తరాంధ్ర లో అరకు..అనకాపల్లి పేర్లతో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అదే విధంగా
తూర్పు గోదావరి జిల్లాలో మూడు లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రధాన కేంద్రంగా కాకినాడ ఉండటంతో..మిగిలిన రాజమండ్రి..అమలాపురం కొత్త జిల్లాలు అయ్యే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం కొత్త జిల్లాగా రూపు సంతరించుకోనుంది. ఇక..క్రిష్టా జిల్లాలో రెండు లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా..క్రిష్ణా జిల్లా యధాతధంగా కొనసాగుతూ విజయవాడ కేంద్రంగా ఉంటుంది. ఇక... మచిలీపట్నం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు జిల్లాలో కొత్తగా బాపట్ల..నర్సరావు పేట జిల్లాలు ఏర్పాటు అవుతాయి. చిత్తూరు జిల్లాలో తిరుపతి పేరుతో కొత్త జిల్లా రానుంది. కర్నూలు జిల్లాలో నంద్యాల కొత్త జిల్లాగా ఏర్పాటు కానుంది. అనంతపురం లో హిందూపూర్ పార్లమెంటరీ పరిధిని పుట్టపర్తి జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. రాజంపేట జిల్లా కొత్తగా ఏర్పాటు అవ్వనుంది. ఇలా ఏపీ సరిహద్దల్లో ఎటువంటి మార్పులు లేకుండా.. అంతర్గతంగా జిల్లాల సరిహద్దులు మారనున్నాయి.

కొత్త జిల్లాల ముహూర్తం ఖరారు..
కొత్త జిల్లాలను ఏర్పాటుకు ముఖ్యమంత్రి ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. నాలుగు నెలల్లోపు కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తును పూర్తిచేసి.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. జనవరి 26న జిల్లాల్లో కలెక్టర్లు జెండా ఆవిష్కరిస్తారు. అందులో భాగంగా కొత్త జిల్లాల్లో కలెక్టర్లు జాతీయ జెండా ఆవిష్కరణ ద్వారా తమ కార్యకలాపాలు మొదలు పెట్టేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. దీని ద్వారా ఏపీలో ఇక.. 25 మంది కలెక్టర్లు.. 25 మంది ఎస్పీలు ఉంటారు. దీంతో పాటుగా గుంటూరు..తిరుపతి లను సైతం పోలీసు కమీషనరేట్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం పైన త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది.












Click it and Unblock the Notifications