జగన్ ప్రభుత్వం సంచలనం: సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన సాయిరెడ్డి: ఆ జాబితాలో ఏపీ..!!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమౌతోన్న అంశంపై సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకెక్కాయి. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో చేరింది. తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. తన పిటీషన్లో వాటన్నింటినీ పొందుపరిచింది.

పిటీషన్ వేసిన విజయసాయి రెడ్డి
అవే- ఉచిత పథకాలు. ఎన్నికల ప్రచార సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత పథకాలకు సంబంధించిన హామీలన్నీ ఆర్థికపరమైనవి కావడం వల్ల వాటిని నియంత్రించాల్సి ఉందంటూ సుప్రీంకోర్టులో కొనసాగుతోన్న వాదనల్లో తమను ఇంప్లీడ్ చేయాలంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ పిటీషన్ దాఖలు చేసింది. పార్లమెంటరీ పార్టీ చీఫ్, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఈ పిటీషన్ వేశారు. ఉచిత పథకాలను సామాజిక పెట్టుబడిగా అభివర్ణించారు.

ఢిల్లీ, తమిళనాడు..
ఎన్నికల ప్రచార సమయంలో ఉచిత పథకాల హామీలను నియంత్రించాల్సిన అవసరం ఉందని, అడ్డగోలుగా వాగ్దానాలు ఇచ్చే పార్టీల ఎన్నికల గుర్తింపును స్తంభింపజేయాలంటూ భారతీయ జనతా పార్టీ నాయకుడు, సుప్రీంకోర్టు అడ్వొకేట్ అశ్విని ఉపాధ్యాయ ఈ పిటీషన్ను దాఖలు చేశారు. దీనిపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, తమిళనాడు నుంచి అధికార డీఎంకే పిటీషన్లు వేశాయి. ఇప్పుడిక తాజాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా వాటితో జత కలిసింది.

పథకాల వివరాలతో..
రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను విజయసాయి రెడ్డి తన పిటీషన్లో పొందుపరిచారు. వాటి అవసరాల గురించి వివరించారు. ప్రతి పేద కుటుంబాన్నీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి అవసరమైన చేయూతను అందిస్తోన్నామని, అది ప్రభుత్వాల బాధ్యతగా వివరించారు. ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, అమ్మఒడి వంటి పథకాలు ప్రజలకు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాన్ని ఇస్తోన్నాయని పేర్కొన్నారు.

సామాజిక పెట్టుబడిగా..
ఉచిత పథకాలను విజయసాయి రెడ్డి సామాజిక పెట్టుబడిగా అభివర్ణించారు. ప్రజలు సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, వాటిని సామాజిక పెట్టుబడిగా భావించాలని కోరారు. ఉచిత పథకాలను రాజకీయ కోణంతో చూడటం సరికాదని, అలా చేయడం రాజ్యాంగాన్ని అవమానించినట్టే అవుతుందని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను ఆదుకోవడం పాలకుల కనీస బాధ్యత అని పేర్కొన్నారు.

ఎన్నికలకు ఆరు నెలల ముందు
ఎన్నికలకు ఆరు నెలల ముందో.. లేక ఏడాది ముందో ఓటర్లను ఆకట్టుకోవడానికి అప్పటికప్పుడు పథకాలను అమలు చేసిన పాలకులు ఉన్నారని, అలాంటి పార్టీల నాయకులు ఇచ్చే హామీలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని సాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రజల కోసం పని చేస్తూ, వారికి అవసరమైన ఆర్థిక చేయూతను అందించడాన్ని రాజకీయ దృష్టితో చూడకూడదని అన్నారు. ఏ వ్యవస్థకైనా ప్రజల సంక్షేమమే అంతిమ పరమార్థమని విజయసాయి రెడ్డి చెప్పారు.

అన్ని పార్టీలు లబ్దిపొందుతున్నాయి..
ఈ పిటీషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇదివరకే పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఒక్క పార్టీ అని కాకుండా అన్నీ కూడా ఉచిత పథకాల హామీలతో లబ్ది పొందుతున్నాయని చెప్పారు. ఏదో ఒక పార్టీ పేరు తాను చెప్పలేనని అన్నారు. ప్రభుత్వానికి తాము చెల్లించిన పన్నులు అభివృద్ధి పనుల కోసం వినియోగించాల్సి ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తారని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఉచిత హామీల గురించి లబ్ది పొందుతున్నవేనని చెప్పారు.












Click it and Unblock the Notifications