ఏపీలో మరో ఉచిత పథకం- అర్హులు, విధివిధానాలు ఖరారు..!!
ఏపీ ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ నిర్ణయాల ప్రక్షాళన కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన ఇసుక విధానం అమలుకు నిర్ణయించారు. ఇసుక ఉచితంగా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ప్రభుత్వం విధి విధానాలు రూపొందించింది. రేపు (సోమవారం) నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. గతంలో ఈ విధానం పైన విమర్శలు రావటంతో ఈ సారి ప్రభుత్వం పక్కగా అమలుకు నిర్ణయించింది.
ఉచిత ఇసుక
రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించడానికి రంగం సిద్ధమైంది. ఈ విధానంలో వినియోగదారులు గనుల శాఖకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఇసుకను మనుషులతో తవ్వి తీయించి, లారీల్లో లోడ్ చేయించి, తిరిగి డిపోలకు తరలించినందుకు గనుల శాఖకు కొంత ఖర్చవుతుంది. దీన్నే నిర్వహణ (ఆపరేషనల్) వ్యయంగా పిలుస్తారు. రీచ్లు, డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఈ ఫీజులను ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీ1-కేటగిరీ ఇసుక రీచ్లే ఉన్నాయి. వీటిల్లో యంత్రాలను ఉపయోగించరు. మనుషులే ఇసుక తవ్వి ట్రాక్టర్ లేదా లారీల్లో లోడ్ చేస్తారు.

మార్గదర్శకాలు
దీనికయ్యే ఖర్చులతో పాటు రీచ్ నుంచి డిపోకు ఇసుకను తరలించడానికి అయ్యే రవాణా చార్జీలను కూడా వినియోగదారులే భరించాలి. జిల్లా కలెక్టర్లు, గనుల శాఖ అధికారులతో కూడిన జిల్లా ఇసుక కమిటీలు ఈ ఫీజులను నిర్ణయించనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 83 బీ1-కేటగిరీ రీచ్ల పరిధిలో ఇసుక డిపోలున్నాయి. ఇవి 18 జిల్లాల్లో ప్రతిమ ఇన్ఫ్రా, 8 జిల్లాల్లో జీసీకేసీ కంపెనీల నియంత్రణలోఉన్నాయి. ఆ కంపెనీల ప్రతినిధుల సమక్షంలో గనుల శాఖ అధికారులు ఇసుక నిల్వలను తనిఖీ చే శారు. మొత్తం 43 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. డిపోల్లో ఉన్న ఈ ఇసుకను సోమవారం నుంచి ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. రోజుకు ఒక్కొక్కరికి సగటున 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధివిధానాల్లో పొందుపరిచారు.
ఆన్ లైన్ లో బుకింగ్
ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ, ట్రాక్టర్, ఎడ్ల బండి వంటి వాహనాలు తీసుకొని వచ్చి ఇసుకను తీసుకెళ్లవచ్చు. ఇసుక అవసరం ఉన్నవారు ఆన్లైన్లోనే బుక్ చేసుకునే ఏర్పాటు కూడా చేయనున్నారు. నిర్వహణ చార్జీలు, ఇంకా గ్రామ పంచాయతీలకు ఇచ్చే రూ.88 ఫీజును ఆన్లైన్లోనే చెల్లించేలా నిబంధన తీసుకురానున్నారు. డిపో పరిధిలో గ్రామ, వార్డు సెక్రటేరియట్ల సిబ్బంది సేవలను వినియోగించు కోనున్నారు. ఫోన్పే, గూగుల్పే, పేటీఎం తదితర యాప్ల ద్వారా ఫీజు చెల్లింపులు జరిపేలా జిల్లాల వారీగా ప్రత్యేక బ్యాంకు ఖాతాలు సిద్ధం చేస్తారు. ఇదిలాఉంటే, ఉచిత ఇసుక విధానంలో ప్రైవేటు అమ్మకాలను నిషేధించనున్నట్లు తెలిసింది. ఇసుక అవసరం ఉన్నవారు నేరుగా తమ ఆధార్ కార్డు, ఫోన్ నంబరు వివరాలను జతచేసి డిపో ఇన్చార్జి వద్ద ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. గృహ నిర్మాణరంగం, ప్రభుత్వ అవసరాల కోసమే ఇసుక ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications