ఆడుదాం ఆంధ్రాలో పాల్గొనాలనుకుంటున్నారా?: అర్హతలు ఇవే- రిజిస్ట్రేషన్ లింక్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన మరో కొత్త కార్యక్రమం- ఆడుదాం ఆంధ్రా (Adudam Andhra). గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి తలపెట్టిన వినూత్న కార్యక్రమం ఇది.
ఈ క్రీడా పోటీల విజేతలకు ప్రభుత్వం భారీగా నగదు బహుమతులు ప్రకటించింది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి అయిదు దశల్లో పోటీలను నిర్వహించనుంది. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విజేతలను సర్టిఫికెట్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది.

క్రీడా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 15 సంవత్సరాల వయస్సు పైన ఉన్న ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనవచ్చు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి అయిదు క్రీడలు- క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనుంది. దీనితోపాటు సంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలను నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం.
తొలి దశలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 1.50లక్షల మ్యాచ్లు జరుగనున్నాయి. ఇక్కడి విజేతలు అనంతరం మండల స్థాయిలో పోటీపడతారు. అంటే 680 మండలాల్లో మొత్తం 1.42లక్షల మ్యాచ్లు ఉంటాయి. ఈ దశలో గెలుపొందిన జట్లను నియోజవకర్గ పోటీలకు పంపిస్తారు. 175 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్లలో పోటీలు నిర్వహిస్తారు.
I am thrilled to announce the kickoff of #AadudamAndhra, our state’s biggest ever statewide sports tournament! With matches held at every single Sachivalayam in the state, this initiative is created to ensure that all our youth have the best opportunities and support to nurture… pic.twitter.com/yMqvfR8BOM
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 27, 2023
వీటిల్లో సత్తా చాటిన వారు జిల్లా స్థాయికి ఆడాల్సి ఉంటుంది. 26 జిల్లాల్లో 312 మ్యాచ్లు నిర్వహిస్తారు. జిల్లా స్థాయి విజేతలతో రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్ల్లో పోటీపడేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో 34.20 లక్షల మంది, మండల స్థాయిలో 17.10లక్షల మంది, నియోజకవర్గ పోటీల్లో 77,520 మంది, జిల్లా స్థాయిలో 19,950 మంది, రాష్ట్ర స్థాయిలో 2,964 మంది 'ఆడుదాం-ఆంధ్ర' క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు.
వివిధ దశల్లో కలిపి మొత్తం 52.31లక్షల మంది ఒకే వేదికపై 50 రోజుల పాటు క్రీడా మహోత్సవంలో సందడి చేయనున్నారు. ఆడుదాం-ఆంధ్రా క్రీడా పోటీల రిజిస్ట్రేషన్ నేడు ప్రారంభించినట్లు శాప్ ఎండీ ధ్యాన్ చంద్ర తెలిపారు. డిసెంబరు 13 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
15 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు పురుషులు గానీ మహిళలు తమ సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయంలో, వాలంటీర్ల ద్వారా, ఆన్లైన్లో aadudamandhra.ap.gov.in వెబ్సైట్ ద్వారా, 1902కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకునే వెసలుబాటును కల్పించింది ప్రభుత్వం.
ఇప్పటికే క్రీడా సామగ్రిని జిల్లాలకు తరలించారు అధికారులు. పోటీల్లో విజేతలకు సర్టీఫికెట్లు, ట్రోఫీలు, పతకాలు అందజేస్తారు. నియోజవకర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి విజేతలకు ప్రత్యేక నగదు బహుమతులు అందజేస్తారు. ఫైనల్స్ను విశాఖపట్నంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications