అమరావతి కేంద్రంగా సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..!!
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల నిర్వహణ పైన ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. షెడ్యూల్ విడుదలకు ముందు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న పెండిండ్ డీఏలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటుగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు రాజధానిలో స్థలాలు కేటాయిస్తూ ఎన్నికల షెడ్యూల్ వెలవడ టానికి కొన్ని గంటల ముందు జీవో జారీ అయ్యాయి.
ఏపీలో ఈ సారి ఎన్నికల పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. రెండు కూటములు, వైసీపీ మధ్య ఎన్నికల యుద్దం పతాక స్థాయికి చేరింది. ఇప్పటికే అభ్యర్దులను ఖరారు చేసిన ప్రధాన పార్టీలు ప్రచారానికి సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలోనే అధికారం నిలబెట్టుకోవటానికి వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, డీఏలను చెల్లించాలని పలు మార్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాయి. మార్చి నెలలో బకాయిలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం..డీఏల విడుదల పైన తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు విడతలుగా పెండింగ్ ఉన్న రెండు డీఏలను విడుదల చేయాలని నిర్ణయించింది.
ఇదే సమయంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు రాజధానిలో స్థలాలు కేటాయించింది. అమరావతిలోని పిచ్చుకలపాలెం గ్రామ పరిధిలో ఉద్యోగులకు స్థలాలు కేటాయిస్తున్నట్లుగా పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి.. జీవోలో పేర్కొన్నారు.
ఉద్యోగులకు ఇచ్చే స్థలాల విస్తీర్ణం, ధర.. 2019లో ప్రభుత్వ ఉద్యోగులకు రాజధానిలో స్థలాలు కేటాయిస్తూ ఇచ్చిన జీవోల్లోని నిబంధనల ప్రకారమే ఉంటుందని తెలిపారు. గతంలోనే దీనికి సంబంధించి నిర్ణయం జరిగింది. మూడు రాజధానుల వివాదం నేపథ్యంలో ఇప్పుడు అమరావతి కేంద్రంగా ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం పైన ఉద్యోగ వర్గాల్లో చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications