Kodali Nani: కొడాలి నానికి భారీ ఊరట- హైకోర్టు కీలక ఆదేశాలు..!
వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani)కి ఇవాళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. వైసీపీ హయాంలో నమోదైన ఓ ఎన్నికల కేసులో ఆయనపై కూటమి సర్కార్ తదుపరి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఇవాళ స్టే మంజూరు చేసింది. దీంతో ఈ కేసులో కొడాలికి ఊరట లభించినట్లయింది. 2021లో నమోదైన ఈ కేసులో ఇప్పుడు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న కూటమి సర్కార్ కు ఇది ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కూ, ప్రభుత్వానికీ మధ్య స్దానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. 2021 ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉండగా విపక్ష నేత చంద్రబాబు, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ పై మంత్రిగా ఉన్న కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై నిమ్మగడ్డ రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల్ని ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో వారు కొడాలి నానిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు పెట్టారు.

అయితే ఈ కేసులో ఆ తర్వాత ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కానీ ఇన్నేళ్ల తర్వాత గుడివాడలో పెండింగ్ లో ఉన్న ఈ కేసులో కొడాలి నానిపై ప్రాసిక్యూషన్ కు అనుమతిస్తూ కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. కొడాలి నానిపై గుడివాడలో నమోదైన కేసులో స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కొడాలి నానిపై ప్రభుత్వం అనుమతించిన ప్రాసిక్యూషన్ పై స్టే ఇవ్వడంతో పాటు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసుల్ని ఆదేశించింది.















Click it and Unblock the Notifications