మద్యపాన ప్రియుల గుండెల్లో జగన్ సర్కార్ మరో ఆటంబాబు పేల్చబోతోందా?: 12 నుంచి 29 వరకు..!
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతోందా? ధనం, మద్యపాన ప్రభావ రహితంగా స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతం చేసే దిశగా అడుగులు వేస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో డబ్బులు పంచినా, మద్యాన్ని ఏరులుగా పారించినా అనర్హత వేటు వేస్తామంటూ ఇప్పటికే హెచ్చరికలను జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాజాగా మరో అడుగు ముందుకేసినట్లు చెబుతున్నారు.
12 నుంచి 29 వరకూ మద్యం దుకాణాలు మూసివేతపై..
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని రెండు వారాల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలనే ప్రతిపాదనలను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ స్థాయిలో మద్యం ప్రభావాన్ని ఓటర్లపై పడకుండా అడ్డుకట్ట వేయడానికి మద్యం దుకాణాలను మూసివేస్తే ఎలా ఉంటుందనే అంశంపై జగన్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే.. ఈ నెల 12వ తేదీ నుంచి 29వ తేదీల మధ్య రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలనే నిబంధనను తెరపైకి తీసుకుని వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
ఇదివరకే మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినప్పటికీ..
నిజానికి- ఇదివరకే ఈ అంశం మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావన వచ్చిందని తెలుస్తోంది. మద్యపాన రహితంగా ఎన్నికలను నిర్వహించాలంటే.. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేంత వరకూ మద్యం దుకాణాలను మూసివేస్తే బాగుంటుందని కొందరు మంత్రులు జగన్ ప్రస్తావించగా అప్పట్లో ఆయన దీన్ని నిరాకరించారని అంటున్నారు. ఒకవంక- మద్యం దుకాణాలను కొనసాగిస్తూనే మరోవంక మద్యాన్ని కట్టడి చేసినప్పుడే ప్రభుత్వం సత్తా, సామర్థ్యం ఏమిటో నిరూపణ అవుతుందని జగన్ వ్యాఖ్యానించారని చెబుతున్నారు.
దుకాణాల మూసివేత లేదా మరింత కుదింపు..
ఎన్నికల సందర్భంగా మద్యాన్ని నియంత్రించడానికి అవసరమైన యంత్రాంగం గ్రామస్థాయిలో లేదని, వాటి అమ్మకాలపై ఇప్పుడు కొనసాగిస్తోన్న ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేస్తే.. ఆశించిన ఫలితాన్ని అందుకోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నెల 12 నుంచి 29వ తేదీ వరకు అంటే.. 15 రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాల్సిన పరిస్థితే వస్తే.. ఆదాయం తగ్గుతుందనే అబిప్రాయం కూడా ముఖ్యమంత్రిలో వ్యక్తమౌతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాలు, అమ్మకాలపై మరిన్ని ఆంక్షలను తాత్కాలికంగా విధించే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని చెబుతున్నారు.
సాయంత్రం 6 గంటల వరకే..
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ముగిసేంత వరకూ మద్యం దుకాణాల సమయాన్ని కుదించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా చూస్తోందని చెబుతున్నారు. సాయంత్రం 6 లేదా 7 గంటల వరకే మద్యాన్ని విక్రయించడానికి అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు కూడా రాత్రి 8 గంటలకు మూతపడుతున్నాయి. ఈ గడువును సాయంత్రం 6 లేదా 7 గంటల వరకు కుదించేలా ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.