పండుగ వేళ రైతులకు తీపి కబురు, రూ 9, 789 కోట్లు జమ - ప్రభుత్వం ప్రకటన..!!
ఏపీ ప్రభుత్వం రైతుల కోసం కీలక ప్రకటన చేసింది. రైతుల ఖాతాల్లో రూ 9,789 కోట్ల జమ చేసినట్లు వెల్లడించింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల కోసం అనేక నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది. రైతుల ధాన్యం సేకరణ... అన్నదాత సుఖీభవ వంటి పథకాలతో పాటుగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తున్నామని వివరించింది. కాగా, ధాన్యం సేకరణ సమయంలో గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు వెల్లడించింది.
రైతులకు తమ ప్రభుత్వ హయాంలో నిజమైన సంక్రాంతి కనిపిస్తోందని మంత్రి మనోహర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కున్నారని విమర్శించారు. రైతుల కష్టాన్ని దళారులు, గతంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు దోచుకుంటే మేం ఆ వ్యవస్థకు స్వస్తి చెప్పి, గిట్టుబాటు ధరను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు రూ.10 వేల కోట్ల మేరకు రైతుల ఖాతాల్లో జమ చేశా మని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల ను వివరించారు. ప్రతి ఇంట సిరులపంట పండుతుందనేది నిరూపించామని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 6,76,848 మంది రైతుల నుంచి 41.27 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, దీని విలువ రూ. 9,789 కోట్లు ఉంటుందని చెప్పారు.

కాగా, రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి చెల్లింపులు కేవలం 4 గంటల్లోనే పూర్తి చేశామన్నారు. తాజాగా రూ.10 వేల కోట్ల రికార్డు స్థాయి చెల్లింపుల లక్ష్యాన్ని అధిగమించామ ని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో కొనుగోళ్లు జరగలేదన్నారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బు కూడా నెలల తరబడి రైతులు ఖాతాల్లోకి వేయలేదన్నారు. ప్రస్తుతం తాము చెప్పినట్టు 24 గంటలు కాకుండా, కేవలం 4 గంటల వ్యవధిలోనే 78 శాతం మంది రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బు జమ చేశామన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 98 శాతం మేర రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తే, కాకినాడ జిల్లాలో 97 శాతం మేరకు ధాన్యం కొన్నామని వివరించారు. ఇక.. వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం కనిపిస్తోంది. పీఎం కిసాన్ 22వ విడత నిధులతో పాటుగా ఏపీ ప్రభుత్వం ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.












Click it and Unblock the Notifications