ఏపీ సమాచార సలహాదారుగా పరకాల, నిన్న బాబుతో..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార సలహాదారుగా పరకాల ప్రభాకర్ను నియమించనున్నారు. పరకాల ప్రభాకర్ గతంలో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా పని చేశారు. ఆయనను ఏపీ ప్రభుత్వం కమ్యూనికేషన్ అడ్వయిజర్గా నియమించినట్లు శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి.
పరకాల ప్రభాకర్ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త. నిర్మల కేంద్ర వాణిజ్య శాఖమంత్రిగా ఉన్నారు. సమాచార సలహాదారుగా పరకాలకు కేబినెట్ హోదా లభిస్తుంది. ఆయన బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. టీడీపీ ఎన్డీయే ప్రభుత్వంలో ఉన్న విషయం తెలిసిందే.

ఆటా సభలకు కోదండరాం
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో నేటి నుంచి ప్రారంభంకానున్న ఆటా సభలకు తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి ఛైర్మన్ ఆచార్య కోదండరాం హాజరవుతున్నారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు పలు విషయాలపై ఆయన ప్రసంగిస్తారు.
ఇప్పటికే తెరాస నేత వి ప్రకాష్ అక్కడికి చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరు, పథకాల అమలు గురించి ఈయన అక్కడి వారికి వివరిస్తారు. ఇక జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, రచయిత సి నారాయణ రెడ్డి, గాయకుడు బాలసుబ్రమణ్యం, సినీ నటులు శ్రేయ, సునీల్, రానా తదితరులు పాల్గొంటున్నారు. ఈ నెల 5 వరకు ఈ సమావేశాలు అట్టహాసంగా జరగనున్నాయి.












Click it and Unblock the Notifications