ఆతిథ్య రంగానికి కేంద్రంగా అమరావతి : 18న ఉన్నత స్థాయి సమావేశం
అమరావతి : నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతిని ఆతిథ్య రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ మేరకు అక్టోబర్ 18న దీనికి సంబంధించిన ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ఏపీ సీఎం చంద్రబాబు సహా ప్రముఖ హోటల్ యాజమాన్యాల ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశముంది.
తాజాగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. సమావేశంలో భాగంగా ఆతిథ్య రంగానికి అనుకూలంగా అమరావతీని తీర్చిదిద్దడంలో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించనున్నారు. ప్రపంచ స్థాయి నగరాలకు ధీటుగా ఉన్నత హంగులతో హోటళ్లను, కన్వెషన్ సెంటర్లను ఏర్పాటు చేసే విషయమై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
అమరావతికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ స్థాయి సదస్సులు, సమావేశాలకు అనుకూలంగా అమరావతిని తీర్చిదిద్దాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అజయ్ జైన్ తెలిపారు. 18న జరగబోయే సమావేశం కోసం వివిధ దేశాల్లో ప్రముఖంగా ఉన్న హోటల్ యాజమాన్యాల ప్రతినిధులను సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) ఆహ్వానించింది. కాగా, ఐటిసి హోటళ్లు, లీలా హోటళ్లు, మహేంద్ర రిసార్టులు, హాలిడే ఇన్, హిల్టన్ హోటళ్ల ప్రతినిధులు సహా మరికొన్ని ప్రముఖ హోటళ్ల ప్రతినిధులు సదస్సులో పాల్గొననున్నారు.