జగన్ మరో సంచలనం: రెస్కోలకు మంగళం -డిస్కాముల్లో విలీనం -కుప్పం రెస్కోపై చంద్రబాబు ఘాటు లేఖ
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రంగానికి సంబంధించి జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థలకు మంగళంపాడుతూ ఈ మేరకు తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు నిరసించాయి. ఏపీలోని మూడు రూరల్ ఎలక్ట్రిక్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (రెస్కో)లను వాటి పరిధిలోని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండళ్లలో (డిస్కాముల్లో) విలీనం చేస్తూ జగన్ సర్కారు గురువారం జారీ చేసిన ఉత్తర్వులు జారీ చేయగా, కుప్పం రెస్కో విలీనాన్ని తప్పుపడుతూ టీడీపీ చీఫ్ చంద్రబాబు.. సీఎస్ ఆదిత్యానాథ్ కు ఘాటు లేఖ రాశారు.

3 రెస్కోల విలీనంపై జీవో..
గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థ లేదా రూరల్ ఎలక్ట్రిక్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో రాష్ట్రంలో కుప్పం, చీపురుపల్లి, అనకాపల్లిలో రెస్కోలు ఉన్నాయి. గృహ, వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల అవసరాలకు విద్యుత్తు సరఫరా చేస్తూ, తక్కువ ఫీజుకే కనెక్షన్లు ఇస్తూ, సమస్యలు ఎదురైనా వెనువెంటనే పరిష్కరించేవిగా ఏళ్లపాటు సేవలందిస్తోన్న ఈ రెస్కోలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మూడు రెస్కోలను డిస్కాముల్లో విలీనం చేస్తూ గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ప్రొసీడింగ్ నంబర్ ఎపిఇఆర్సి /ఇా221/19/2021ను ఏపీ ఈఆర్సీ చైర్మన్ నాగార్జున రెడ్డి ఉత్వర్వులు విడుదల చేశారు. దీనికి..

రెస్కోల మంగళానికి కారణాలివే..
లైసెన్సు జారీకి ప్రభుత్వం నుంచి పొందిన అనుమతుల దాఖలులో రెస్కోలు విఫలమైన కారణంగానే రెస్కోలను విలీనం చేస్తున్నామని, ఇవి నిర్వహించే బిల్లుల వసూలు, సప్లై బాధ్యతలను వాటి పరిధిలని డిస్కాములకు అప్పగిస్తున్నామని సర్కారు తన ఆదేశాల్లో పేర్కొంది. అయితే, రెస్కో కార్మికులు, ప్రతిపక్షాల వాదన మాత్రం మరోలా ఉంది. ఎప్పటి నుంచో రెస్కోలను డిస్కాముల్లో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే ఇలా లైసెన్సును సాకుగా చూపి విలీనం చేసిందని ఆక్షేపిస్తున్నారు.

కీలకంగా ఆ మూడు రెస్కోలు..
అత్యంత మారుమూల ప్రాంతమైన కుప్పంలో వంద శాతం నాణ్యమైన విద్యుత్తు అందుతోందంటే దీనికి కారణం రెస్కోనే అని, ఈ సంస్థలో మొత్తం 130 మంది శాశ్వత ప్రాతిపదికన, 26 మంది కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నారని, పరిధిలో 110 పంచాయతీలు, 697 గ్రామాలు ఉన్నాయని, చెరకు, టమాటా, పట్టు, ఉద్యాన పంటల రైతులకు రెస్కో పలు రకాలుగా సేవలందిస్తోందని, సదరు సంస్థను ఇప్పుడు డిస్కంలో విలీనం చేయడం దారుణమంటూ శుక్రవారం కుప్పంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ధర్నాకు దిగాయి.

కాలేజీని కూడా నిర్వహిస్తూ..
అటు అనకాపల్లి రెస్కో 500 బెల్లం క్రషర్లకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తోందని, అక్కడ సంస్థకు రూ.కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని, 2009 నుంచి ఓ పాలిటెక్నిక్ కళాశాలను నిర్వహిస్తున్నారని, అందులో యాభై శాతం సీట్లు సంస్థ వినియోగదారుల పిల్లలకు కేటాయిస్తూ ఉచిత విద్య అందిస్తున్నారని రెస్కో సిబ్బంది, విపక్ష నేతలు పేర్కొన్నారు. అనకాపల్లి రెస్కోలో 117 మంది పర్మినెంట్ ఉద్యోగులు, 400 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని నేతలు చెబుతున్నారు ఇక విజయనగరం జిల్లా చీపురుపల్లి 1982లో 16 మంది ఉద్యోగులతో ప్రారంభమైన రెస్కోలో ముగ్గురు సబ్-ఇంజినీర్లు, ముగ్గురు అసిస్టెంట్ ఇంజినీర్లు సహా సుమారు వంద మంది పని చేసేవారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం 62 మంది ఉన్నారని నేతలు వివరించారు. కాగా,

కుప్పం రెస్కోపై చంద్రబాబు లేఖ
ఏపీలో రెస్కోలకు మంగళంపాడుతూ, వాటిని డిస్కాముల్లో విలీనం చేయాలన్న జగన్ సర్కారు నిర్ణయాన్ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకించాయి. కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ (రెస్కో) స్వాధీనానికి ఏపీఎస్పీడీసీఎల్కు ఏపీఈఆర్సీ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. విద్యుత్ అమ్మకం, పంపిణీ, రిటైల్ లైసెన్స్ మినహాయింపు పొందడంలో విఫలమైందనే కారణాలు చూపుతూ రెస్కోను స్వాధీనం చేసుకోవడం ఏకపక్ష చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. రెస్కోను డిస్కంలో విలీనం చేయడం సరైంది కాదంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు చంద్రబాబు ఓ లేఖ రాశారు. అందులో..

రెస్కోల విలీనం అర్థంలేని చర్య..
''ఎంతో వెనుకబడిన, మారుమూల ప్రాంతమైన కుప్పంలో వందశాతం విద్యుదీకరణ లక్ష్యంతో 1981లో రెస్కోను స్థాపించారు. దాదాపు 1,22,000 మంది వాటాదారులుగా ఉన్న ఈ సంస్థకు 1,24,000 గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అత్యధిక వాటాదారులుగా చిన్న, మధ్యతరగతి రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలవారున్నారు. కుప్పం నియోజకవర్గానికి, ప్రజలకు గర్వకారణంగా ఉన్న ఈ సంస్థలో మెజారిటీ వాటాదారుల జీవనోపాధి వ్యవసాయం. స్థాపించిన నాటి నుంచి విజయవంతంగా నడుస్తోన్న రెస్కోను చిన్న కారణంతో ఏపీఎస్పీడీసీఎల్లో విలీనం చేయడం అర్థం లేని చర్య. కుప్పం ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఏపీఈఆర్సీ తీసుకున్న నిర్ణయం ఎంతో నిరాశకు గురిచేసింది'' అని చంద్రబాబు సీఎస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications