రిలయన్స్ పై దాడులు..తుని కాపు ఉద్యమ కేసులు ఎత్తివేత: భోగాపురం నిరసనకారులపైనా..: ప్రభుత్వ ఉత్తర్వులు
రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో సంచలనానికి కారణమైన రెండు రకాల అంశాల్లో నమోదైన కేసులను ఉప సంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. వైయస్సార్ మరణం సమయంలో జరిగిన అల్లర్ల కేసులను ఉప సంహరించుకుంది. వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదం వెనుక రిలయన్స్ హస్తం ఉందని అప్పట్లో వార్తలు వ్యాపించడంతో ఆయన అభిమానులు రెండు జిల్లాల్లో పలు చోట్ల రిలయన్స్ మాల్స్పై దాడులకు దిగి ధ్వంసం చేశారు. అప్పట్లో బాధ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతోపాటు కాపు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా జరిగిన విధ్వంసం కేసులను కూడా ఎత్తివేయటంతో పాటుగా..భోగాపురం భూ సేకరణ సమయంలో వ్యతిరేకించిన వారిపైన నమోదైన కేసులను ఉప సంహరించుకుంటూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
రిలయన్స్ పై దాడుల కేసులు ఎత్తివేత
పదేళ్ల క్రితం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు జరిగిన అల్లర్ల కేసులను ప్రభుత్వం ఉప సంహరించుకుంది. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం వెనుక రిలయన్స్ హస్తం ఉందని అప్పట్లో వార్తలు వ్యాపించడంతో ఆయన అభిమానులు ఉమ్మడి రాష్ట్రంలోని గుంటూరు..అనంతపురం జిల్లాల్లో పలు చోట్ల రిలయన్స్ మాల్స్పై దాడులకు దిగి ధ్వంసం చేశారు. అప్పట్లో బాధ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వాటిని ఎత్తేసే విషయమై తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఒక రష్యన్ వెబ్ సైట్ లో వచ్చిన కధనం ఆధారంగా కొన్ని వార్తా సంస్థలు ఈ వార్తను ప్రచారంలోకి తెచ్చాయి. దీంతో..అప్పట్లో వైయస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో రిలయన్స్ సంస్థల పైన దాడులకు దిగటం సంచలనం అయింది. జాతీయ స్థాయిలో దీని పైన పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఈ కేసుల ను ప్రభుత్వం ఉప సంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తుని విధ్వసం కేసులు ఉపసంహరణ...
కాపు రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సభ ఏర్పాటు చేసారు. ఆ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కాపు నేతలు హాజరయ్యారు. సభ జరుగుతుండగానే కొందరు యువకులు సడన్ గా తుని పోలీస్ స్టేషన్పై దాడి, రైలుపై రాళ్లు రువ్విన ఘటనలో పలువురిపై సుమారు 69 కేసులు నమోదయ్యాయి. ఇందులో వైసీపీ నేతలు కొందరిపైన ఆరోపణలు రావడంతో అప్పట్లో సీఐడీ పోలీసులు విచారించారు. అదే సమయంలో రత్నాచల్ ఎన్స్ ప్రెస్ ను దహనం అయింది. దీంతో..ఆ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది. వైసీపీ నేత భూమన కరుణాకర రెడ్డిని సైతం పోలీసులు విచారించారు. కడప నుండి వచ్చిన వారే విధ్వంసానికి కారణమంటూ నాటి ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అయితే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఈ కేసుల వ్యవహారం పైన కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రానికి రైలు దహనం కేసు పైన నివేదించాలని నిర్ణయించింది. 2016 జనవరిలో జరిగిన తుని ఘటన కేసులను ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు ఇచ్చింది.
భోగాపురం ఆందోళన కారుల కేసుల్లోనూ
ఈ రెండింటితో పాటుగా భోగాపురం విమానాశ్రయం కోసం ప్రభుత్వం భూ సేకరణ చేసింది. ఆ సమయంలో భూ సేకరణకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు నిర్వహించారు. ఆ సమయంలో భూ సేకరణను అడ్డకుంటున్నారనే కారణంతో పలువురి మీద కేసులు నమోదు చేసారు. ఇప్పుడు ప్రభుత్వం వాటిని సైతం ఉప సంహరించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11న జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో..ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పుడు అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.