అమరావతికి మరో కీర్తి కిరీటం - చరిత్రలో నిలిచేలా, వెయ్యి కోట్లతో...!!
అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. నిర్మాణాల ప్రక్రియ వేగం పెరిగింది. 2028 నాటికి తొలి దశ నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటికే అధికారులు, ఎమ్మెల్యేల వసతి సముదాయాలను ప్రారంభించారు. కాగా.. గవర్నర్ బంగ్లాతో పాటుగా విజయవాడ నుంచి అమరావతికి మరో రహదారి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇక.. రూ వెయ్యి కోట్లతో చేపడుతున్న ప్రతిష్ఠాత్మక నిర్మాణం అమరావతిలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
రాజధాని అమరావతిని విజయవాడతో అనుసంధానం చేస్తూ మరో ప్రతిష్ఠాత్మకపైన బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం, అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏజీఐసీఎల్) శ్రీకారం చుట్టాయి. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ఫీజిబిలిటీ, సమగ్ర ప్రాజెక్టు నివేదిక కోరుతూ ఏజీఐసీఎల్ టెండర్లను ఆహ్వానించింది. ఇప్పుడు డీపీఆర్ సిద్దం అవుతోంది. ఈ ప్రతిపాదిత సిగ్నేచర్ వంతెనను విజయవాడ ప్రకాశం బ్యారేజీ , రైల్వే వంతెనల మధ్య ప్రాంతంలో నిర్మించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. సుమారు 1.10 కిలోమీటర్ల పొడవునా, ఆరు లేన్ల విశాలమైన రహదారితో ఈ వంతెన నిర్మాణం జరగనుంది. ఇది విజయవాడ నగరంతో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా అమరావతికి అత్యుత్తమ కనెక్టివిటీని అందించి, భవిష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్ అవసరాలకు శాశ్వత పరిష్కారంగా నిలవనుంది. ఈ వంతెనను ప్రస్తుతం నిర్మించిన సీడ్ యాక్సిస్ రోడ్డుతో అనుసంధానించడం ద్వారా అమరావతికి మరింత మెరుగైన కనెక్టివిటీని కల్పించనున్నారు. ఏజీఐసీఎల్ టెండర్ల ప్రకారం కొత్తగా నిర్మిస్తున్న ఈ బ్రిడ్జికి 'సిగ్నేచర్ బ్రిడ్జ్'గా పేరును ఖరారు చేశారు.

ప్రత్యేక ఆకర్షణగా.. అందరినీ ఆకట్టుకొనేలా
హైదరాబాద్-మచిలీపట్నం జాతీయరహదారి(ఎన్హెచ్-65), విజయవాడ నగరాలతో అమరావతి అనుసంధానాన్ని మెరుగుపరచనున్నారు. దీనికిగాను బ్యారేజీకి 300 మీటర్ల దిగువన, అంటే ప్రకాశం బ్యారేజీ, రైలు బ్రిడ్జిలకు మధ్యలో సిగ్నేచర్ బ్రిడ్జిని నిర్మిస్తారు. ఈ బ్రిడ్జిని కేవలం రవాణా వ్యవస్థ కోసమే కాకుండా, రాజధాని అమరావతికి ఒక ఐకానిక్ ల్యాండ్మార్క్గా, పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దనున్నారు. ఇందులో భాగంగా వంతెన ఇరువైపులా కాలినడకన వెళ్లే వారి కోసం ఫుట్పాత్లు, పర్యావరణ హిత ప్రయాణాన్ని ప్రోత్సహించేలా ప్రత్యేక సైకిల్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నారు. నది అందాలను తిలకించేలా ఆధునిక లైటింగ్, ప్రత్యేక వ్యూ పాయింట్లతో ఈ వంతెనను డిజైన్ చేస్తున్నారు. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) పద్ధతిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కాన్సెప్ట్, డిజైన్లు, వ్యయ అంచనాల ఆధారంగా ఎంపికైన కన్సల్టెన్సీ సంస్థ నిర్మిస్తుంది.













Click it and Unblock the Notifications