ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా : మీ సేవ రద్దుకు ప్రతిపాదనలు : అమలైతే..!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు పౌర సేవలు అందించటంతో కీలక పాత్ర పోషిస్తున్న మీ సేవ కేంద్రాలను రద్దు చేసే ప్రతిపాదన అధికారులు సిద్దం చేసారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం అక్టోబర్ రెండో తేదీ నుండి గ్రామ సచివాలయాలను ప్రారంభిస్తోంది. దీని ద్వారా అన్ని రకాల పౌర సేవలను అందించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీంతో..మీ సేవ కేంద్రాలు అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. మీ సేవా కేంద్రాలు రద్దు అయితే అందులో పని చేస్తున్న ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. దీని పైన మీ సేవ ఉద్యోగులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ దీని పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారింది.

మీ సేవ రద్దు యోచనలో ప్రభుత్వం..
ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. ఇప్పటి వరకూ వివిధ రకాలైన పౌర సేవలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న మీ సేవ కేంద్రాలను రద్దు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అక్టోబరు 2నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి రానుండటంతో ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మీ సేవలో అందించే పౌర సేవలన్నీ ఇక మీదట గ్రామ సచివాలయాల నుంచి అందేలా చర్యలు చేపట్టనున్నారు. అధికారులు ఇప్పటికే ఈ దిశగా ప్రతిపాదనలు సిద్దం చేసి..ముఖ్యమంత్రి అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నారు. రద్దు చేసే మీ సేవ కేంద్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అర్బన్ మీ సేవ కేంద్రాలు ఉంటాయా.. లేక ఫ్రాంఛైజీల ద్వారా నడిచే మీ సేవ కేంద్రాలు ఉంటాయా అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఏపీలో 2003 లో మీ సేవ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. తొలుత నాలుగు రకాల సేవలతో ప్రారంభమైన మీ సేవ నేడు 367 రకాల ప్రభుత్వ సేవలు, మరో 30 రకాల ప్రైవేటు సేవలు అందిస్తోంది.

ఏపీలో పదివేల వరకు కేంద్రాలు..
రాష్ట్ర వ్యాప్తంగా 11,054 కేంద్రాలకు దశల వారీగా ప్రభుత్వం అనుమతిలిచ్చింది. ఇందులో రెండువేలకు పైగా మీ సేవలు పనులు లేక నిరుపయోగంగా మారడంతో మూతబడ్డాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అర్బన్ మీ సేవ కేంద్రాలు సుమారుగా 200 వరకు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫ్రాంచైజీల కింద 9,020 మీ సేవ కేంద్రాలు పౌరులకు సేవలందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు ఏజెన్సీల గడువు ముగియడంతో కార్పొరేట్ కంపెనీలకు మీ సేవ సాప్ట్వేర్ అగ్రిమెంట్లను బదిలీ చేయవచ్చని భావిస్తున్న తరుణంలో గ్రామసచివాలయాల ద్వారా పౌర సేవలందించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపినట్లు సమాచారం. మీ సేవలో అందించే పౌర సేవలను కేటగిరీల వారీగా విభజించారు. రెవెన్యూ సేవల్లో ఎ కేటగిరీ కింద అందించే 15 రకాల సేవలను దరఖాస్తు చేసుకున్న 15 నిమిషాల్లో ఆందుకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించిన నీటి తీరువా బిల్లులు, మంచినీటి కుళాయి పనులు, రెసిడెన్సీ సర్టిఫికెట్లు, ఇన్కమ్ ఫీజు రీ ఎంబర్స్మెంట్ సర్టిఫికెట్లు లాంటివి ఉన్నాయి.

ఉద్యోగుల భవిష్యత్ పైన ఆందోళన..
మీ సేవా కేంద్రాల్లో కేటగిరి -బి కింద సింగిల్ విండో ల్యాండ్కన్వర్షన్, డాటెడ్ ల్యాండ్స్, టూటిల్ డీడ్, టైటిల్ డీడ్ కమ్ పాస్బుక్, ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్లు, ఆదాయ ధృవీకరణ పథకం, నో ఎర్నింగ్ సర్టిఫికెట్స్, పాన్బ్రోకర్, అడంగల్ కంప్యూటరైజ్డ్ అడంగల్ 1బి, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్, సర్టిఫైడ్ కాపీస్ ఇష్యూడ్ బై ఆర్డీఓ, కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన సర్టిఫికెట్లు, మ్యాన్యువల్ అడంగల్, ఓబిసి, ఈబిసి, నో ఎర్నింగ్ సర్టిఫికెట్లు, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయానికి సంబందించిన సర్టిఫికెట్లు, ఈ పాస్బుక్ రీ-ప్టేస్మెంట్, ఈ -పాస్బుక్ డూప్లికేట్, సినిమా లైసెన్స్ రెన్యూవల్స్్, లోన్ ఎలిజిబిలిటీ కార్డు(ఎల్ఇసి), పట్టా సబ్ డివిజన్ లాంటి కీలకమైన సేవలన్నీ మీ సేవ ద్వారానే దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇటువంటి కీలకమైన పౌర సేవలందించేందుకు సర్వీస్ ఛార్జీగా ప్రభుత్వం ఒక్కో దరఖాస్తుకు ఎంత తీసుకోవాలనేది నిర్దేశించింది. భవిష్యత్తులో మీ- సేవలు రద్దు చేయాలనే ప్రతిపాదనల పైన ముఖ్యమంత్రి ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ముఖ్యమంత్రి సైతం ఆమోద ముద్ర వేస్తే వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు.












Click it and Unblock the Notifications