అనంతబాబు కేసులో పోలీసు అధికారులపై వేటు..!!
ఏపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సంచలనం రేపిన డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో నలుగురు పోలీస్ అధికారుల పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసు లో పలువురు పోలీసులు అనంతబాబుకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణ ఉండటంతో వారి పైన ప్రభుత్వం వేటు వేసింది. ఈ కేసులో పోలీసులు కుమ్మక్కు అయ్యారంటూ సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న నలుగురు పోలీసు అధికారుల పై ప్రభుత్వం వేటు వేసింది. ఈ కేసు విచారణ సమయంలో పోలీసులు కుమ్మక్కు అయ్యారంటూ సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. 2022, మే 19న జరిగిన హత్య కేసు విచారణలో నిందితుడైన అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణలో లోపాలపై శుక్రవారం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు డిఫాల్ట్ బెయిల్ అందించడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయని, అత్యంత హేయమైన నేరంలో పోలీసుల తీరు ఆక్షేపణీయమని సుప్రీం కోర్టు మండిపడింది.

నలుగురు పోలీసు అధికారుల పై వేటు
అదే సమయంలో కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి నిందితులకు కొమ్ము కాసిన పోలీసులపై ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. అప్పటి పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో కేసులో కీలక ఆధారాలు కావాలని విస్మరించి నిందితుడైన అనంతబాబుకు సహకరించిన నలుగురు పోలీస్ అధికారులపై డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా ప్రభుత్వం సస్పెండ్ చేసిన వారిలో కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన అప్పటి కాకినాడ డీఎస్పీ, ప్రస్తుతం భీమవరం అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న వి.భీమారావు, వెయిటింగ్లో ఉన్న డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, అప్పట్లో సర్పవరం సీఐగా పనిచేసి ప్రస్తుతం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆకుల మురళీకృష్ణ, అప్పట్లో కేసు నమోదైన సర్పవరం స్టేషన్ ఎస్ఐగా ఉండి, ప్రస్తుతం కాకినాడ పోర్టు పోలీ్సస్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎన్.సతీష్ బాబు ఉన్నారు. ఈ పోలీసు అధికారులపై వెంటనే క్రమశిక్షణ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలని, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.












Click it and Unblock the Notifications