AP Govt: ఏపీ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్- రేపు కీలక భేటీకి పిలుపు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం (AP Govt) అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఇంకా ఉద్యోగుల (Employees) సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. ముఖ్యంగా డీఏ, పీఆర్సీ సహా వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. దీంతో పాటు కొత్త పీఆర్సీని నియమించాల్సి ఉంది. ఆ లోపు ఐఆర్ ప్రకటించాల్సి ఉంది. ఆయా అంశాలపై ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని ఉద్యోగ సంఘాల నేతల ద్వారా ఇవాళ తెలుసుకున్న ప్రభుత్వం శనివారం కీలక భేటీకి పిలుపునిచ్చింది.
ఇవాళ అమరావతి సచివాలయంలో కేబినెట్ భేటీ తర్వాతఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేతలతో మంత్రులు భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, త్వరలోనే అన్ని ఉద్యోగ సంఘాలతో భేటీ కావాలని ఆలోచన చేస్తోందని వారికి మంత్రులు తెలిపారు. అంశాల వారీగా వారి సమస్యలు, డిమాండ్లు పరిష్కరించేందుకు ఉద్యోగ సంఘాలతో సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. తమకు రావాల్సిన బకాయిలు,డీఏలు, పిఆర్సీ సహా వివిధ అంశాల్లో ఉద్యోగులు గళం విప్పుతున్న నేపథ్యంలో వారి సమస్యను అర్థం చేసుకున్న ప్రభుత్వం ఈ చర్చలు ప్రారంభిస్తోంది.

ఇందులో భాగంగా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేతల్ని మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ సమావేశానికి ఆహ్వానించారు. మంత్రుల ఆహ్వానం మేరకు ఏపీ జేఏసీ నేతలు సచివాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో భేటీ అయ్యారు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తో పాటు ఇతర నేతలు, మంత్రులతో జరిగిన ప్రాథమిక స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని మంత్రులు ఏపీ జేఏసీ అమరావతి సంఘం నేతలకు వివరించారు. ఉద్యోగుల ఆర్ధిక, ఆర్థికేతర అంశాలపై ప్రాథమిక స్థాయిలో చర్చించిన మంత్రులు..శనివారం సచివాలయంలో పూర్తి స్థాయిలో చర్చించాలని నిర్ణయించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉన్న ప్రభుత్వం...ఉద్యోగ సంఘాలతో భేటీ కానుంది. ఇందులో ఆయా సమస్యల పరిష్కారంపై క్లారిటీ ఇవ్వబోతోంది.













Click it and Unblock the Notifications