నేడే ఏపీ బడ్జెట్ రూ 2.59 లక్షల కోట్లు - ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు..!?
ఏపీ ప్రభుత్వం 2023-24 బడ్జెట్ వేళ కీలక ప్రకటనలకు సిద్దం అవుతోంది.
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కీలక బడ్జెట్ అసెంబ్లీ ముందుకు వస్తోంది. జగన్ ప్రభుత్వం ఈ విడతలో చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. దాదాపుగా రూ 2.59 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్దం అయింది. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ జెండర్ బేస్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం, పేదల ఇళ్లకు పెద్దపీట. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. సంక్షేమ రంగానికి మరోసారి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం బడ్జెట్ వేళ కీలక ప్రకటనలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

నేడు ఏపీ 2023-24 వార్షిక బడ్జెట్
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం తమ అయిదో బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు సిద్దమైంది. ముందుగా కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయనున్నారు. అసెంబ్లీలో మంత్రి బుగ్గన బడ్జెట్ ను సమర్పిస్తారు. దీనికి కొనసాగింపుగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను సభ ముందు ఉంచుతారు. అదే సమయంలో అటు మండలిలో సాధారణ బడ్జెట్ ను డిప్యూటీ సీఎం అంజాద్ బాష.. వ్యవసాయ బడ్జెట్ ను సిదిరి అప్పలరాజు ప్రవేశ పెడతారు. ఈ సారి బడ్జెట్ రూ 2.79 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం కనిపిస్తోంది. 2022-23 బడ్జెట్ ను ఏపీ ప్రభుత్వం రూ 2,56,256 లక్షల కోట్లతో ప్రతిపాదించింది. ఈ సారి ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టే చివరి బడ్జెట్ కావటంతో గత కేటాయింపులు పెంచినట్లు తెలుస్తోంది. ఈ సారి బడ్జెట్ పూర్తిగా మహిళా - వ్యవసాయ ప్రాధాన్యత ఇస్తూ సిద్దం అయినట్లు సమాచారం.

సంక్షేమం - అభివృద్ధి సమ్మిళితం చేస్తూ
గత ఏడాది బడ్జెట్ లో ఏపీ ప్రభుత్వం మొత్తం రూ 1,91,225 కోట్ల మేర రెవిన్యూ రాబడులు వస్తాయని అంచనా వేసింది. తొలి పది నెలల కాలంలో రూ 1,24,109 కోట్ల మేర మాత్రమే రాబడి సాధ్యమైంది. ఈ సారి బడ్జెట్ లో కేంద్ర పన్నుల వాటా అంచనాగా రూ 41,388 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ఆదాయాన్ని వాస్తవిక అంచనాలకు ఆధారంగా ప్రతిపాదనలు చేస్తున్నట్లు సమాచారం. పాదయాత్ర సమయం నుంచి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వైసీపీ ప్రభుత్వం నవరత్నాల అమలుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ సారి బడ్జెట్ లోనూ నవరత్నాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. సంక్షేమం తో పాటుగా అభివృద్ధి సమ్మిళితం చేస్తూ కీలక రంగాలకు కేటాయింపులు జరిగాయని సమాచారం. అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ పథకాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.

కీలక ప్రటకలనకు అవకాశం
ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అనేక డిమాండ్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటనలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు బడ్జెట్లో తగిన కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న విద్య - వైద్యం రంగాల్లో కేటాయింపులు గతం కంటే భారీగా పెంచే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందించారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేయనున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం సబ్సిడీకి తగినన్ని నిధులు కేటాయించనున్నారు. ఉద్యోగుల అంశాలతో పాటుగా కొత్త ఉద్యోగాల కల్పన..పెట్టుబడి దారుల సదస్సు లో ఏపీకి రూ 13 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చిన సందర్భంలో ప్రభుత్వ తమ కార్యాచరణ బడ్జెట్ లో స్పష్టం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో అనూహ్యంగా ప్రభుత్వం నుంచి కీలక ప్రకటనలకు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications