ఏపీలో కరోనా టెస్టుల సామర్ధ్యం రెట్టింపు- త్వరలో రోజుకు 4 వేల పరీక్షలు
ఏపీలో కరోనా వైరస్ పరీక్షల నిర్వహణ చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికే నేరుగా గుర్తించిన రోగులకు క్వారంటైన్ తో పాటు పరీక్షలు కొనసాగుతుండగా.. తాజాగా నిర్వహించిన మూడు సర్వేల్లో గుర్తించిన అనుమానితులకూ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సాధ్యమైనంత తక్కువ సమయంలో వీటిని పూర్తిచేసేందుకు వీలుగా పరీక్షల సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తున్నారు.

ఏపీలో కరోనా పరీక్షలు..
ఏపీలో ప్రస్తుతం సగటున రోజుకు 2100 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలో వీటిని రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే గుర్తించిన రోగులతో పాటు క్వారంటైన్ సెంటర్లలో ఉన్న వారు, అలాగే సర్వేల్లో గుర్తించిన వారికీ కరోనా పరీక్షలు చేపట్టాలని సీఎం జగన్ ఇవాళ సమీక్షలో అధికారులకు సూచించారు. దీంతో నాలుగైదు రోజుల్లో వీరికి పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా 4 వేల టెస్టులకు చేరుకునేలా సామర్ధ్యాన్ని సిద్దం చేస్తున్నారు.

సర్వేల్లో తేలిన 32 వేల మంది..
ఇప్పటివరకూ ఏపీలో కరోనా వైరస్ బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం వాలంటీర్లు, ఆశావర్కర్ల సాయంతో మూడు విడతలుగా సర్వేలు నిర్వహించింది. వీటి ద్వారా మొత్తం 32 వేల మంది అనుమానితులను గుర్తించారు. అయితే వీరికి వెంటనే పరీక్షలు నిర్వహించేందుకు తగిన సదుపాయాలు లేవు. దీంతో పరీక్షలు నానాటికీ ఆలస్యమవుతున్నాయి. ప్రభుత్వ సూచనల ప్రకారం అధికారులు టెస్టింగ్ కెపాసిటీని పెంచడంతో త్వరలో వీరికి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

క్వారంటైన్ సెంటర్లలో ఖర్చులు..
ఏపీలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో తగిన సదుపాయాలు లేవనే ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో ప్రభుత్వం తాజాగా ఇక్కడ రోగులకు ప్రతిరోజూ ప్రతి మనిషికి భోజనం, బెడ్కోసం, దుప్పటికోసం రూ. 500 ఖర్చు చేస్తున్నారు. ప్రతిరోజూ ప్రతిమనిషికి రూ. 50లు పారిశుద్ధ్యం కోసం,
ఇతరత్రా ఖర్చులకోసం రోజుకు రూ.50లు, ప్రయాణ ఖర్చుల కింద క్వారంటైన్ సెంటర్కు రూ.300లు, తిరుగు ప్రయాణంకోసం కూడా మరో రూ.300లు ఖర్చు చేస్తున్నట్టుగా అధికారులు సీఎంకు తెలిపారు. డబుల్ రూం లేదా, సింగిల్రూం ఇస్తున్నామని చెప్పారు. క్వారంటైన్ సెంటర్లలో మెడికల్ ప్రోటోకాల్ పూర్తిచేసుకుని తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు బీదలకు కనీసం రూ.2వేలు ఆర్థిక సహాయం చేయాలని సీఎం వారికి సూచించారు. వాళ్లు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పాటించాల్సిన జాగ్రత్తలను సూచించాని సీఎం ఆదేశించారు.












Click it and Unblock the Notifications