ఏపీలో పేదల ఇళ్లపై కీలక అప్డేట్..! డెడ్ లైన్ ఖరారు..!
ఏపీలో ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం (ap govt) ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రస్తుతం పేదల కోసం చేపడుతున్న ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ గృహనిర్మాణశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కొలుసు పార్ధసారధి ఈ మేరకు టార్గెట్ పెట్టేశారు. దీంతో పేదలకు ఈసారి కచ్చితంగా ఇళ్ల పంపిణీ ఖాయంగా కనిపిస్తోంది.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి పార్థసారథి అధికారులను ఆదేశించారు. రానున్న ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి వాటి ప్రారంభోత్సవానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు టార్గెట్ ఇచ్చారు. విజయవాడలోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అమలు తీరుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ప్రతీ పేదవాడికీ పక్కా ఇల్లు నిర్మించాలని, ఆ లేఔట్ లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నాణ్యతతో కూడిన ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఉగాది నాటికి పూర్తి చేయడానికి రోజువారి లక్ష్యాలను నిర్దేశించుకుని పనులు పూర్తి చేయాలని, ప్రతిరోజు అధికారులు తనిఖీ చేసి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసే విధంగా లబ్ధిదారులను ప్రోత్సహించాలని మంత్రి కోరారు.

అలాగే హౌసింగ్ బోర్డు ద్వారా పూర్తి చేసుకున్న ఇళ్లలో తక్షణం లబ్ధిదారులు గృహప్రవేశం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి పార్థసారథి ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన కాలనీలలో లబ్ధిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికను వెంటనే తయారు చేయాలని, ఇతర ప్రభుత్వ శాఖలు పంచాయతీరాజ్, పురపాలక, పబ్లిక్ హెల్త్ విభాగాలతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలు చేపడదామని తెలిపారు. పేదలకు ఇళ్ల నిర్మాణాల బాధ్యత తీసుకున్న అధికారులు, నిర్మాణాలు పూర్తి ఆయన ఇళ్లలోనికి లబ్ధిదారులు చేరేవరకూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications