ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రధాని ఆరా: మోడీతో జగన్ భేటీ: సీఎంలకు: లైట్ హౌస్ ప్రాజెక్ట్
అమరావతి: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) అమలు తీరుతెన్నులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఉదయం ఆయన న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రలతో సమావేశం అయ్యారు. పీఎంఏవై పథకం గురించి ఆరా తీశారు. ఈ పథకం అమలు ఏఏ రాష్ట్రాల్లో ఏ స్థాయిలో ఉందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన లైట్ హౌస్ ప్రాజెక్ట్ (ఎల్హెచ్పీ)ను ప్రారంభించారు.
Recommended Video
నెల పొడవునా అవే ఆంక్షలు..జగన్ సర్కార్ కొత్త ఆదేశాలు
ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎడప్పాడి పళనిస్వామి (తమిళనాడు), శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), విజయ్ రుపాణీ (గుజరాత్), హేమంత్ సోరెన్ (జార్ఖండ్), యోగి ఆదిత్యనాథ్ (ఉత్తర ప్రదేశ్), బిప్లబ్ కుమార్ దేబ్ (త్రిపుర) పాల్గొన్నారు. తమ రాష్ట్రాల్లో కొనసాగుతోన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాల గురించి వారంతా నరేంద్ర మోడీకి వివరించారు. పీఎంఏవైతో పాటు తమ రాష్ట్రాల్లో చేపట్టిన ఇళ్ల పథకాలు, నిర్మాణాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. రాష్ట్రంలో కొత్తగా చేపట్టి ఇళ్ల పట్టాల పంపిణీ పథకం గురించి ప్రస్తావించారు.
కిందటి నెల 25వ తేదీన తాము ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని ప్రారంభించినట్లు ప్రధానికి తెలియజేశారు. ఒకేరోజు 30.75 వేల మంది అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలను అందజేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమాన్ని రెండు వారాల పాటు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ చేయడానికి అవసరమైన స్థల సేకరణలో కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయని వైఎస్ జగన్..ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలను పూర్తి చేసుకుంటోన్న దశలో గూడు లేని నిరుపేదలు ఉండకూడదనే ఉద్దేశంతో తాము ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వైఎస్ జగన్ వివరించారు.
ప్రతి సంవత్సరం వరదలు, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటోన్న ఏపీ వంటి రాష్ట్రాల్లో నివసించే నిరుపేదలకు ఇళ్లను కట్టించి ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ దిశగా తన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2022 నాటికి దేశంలో ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా తాము పని చేస్తున్నామని వైఎస్ జగన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని తాము అందరికంటే ముందే అందుకుంటామనే ధీమాను ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నరేంద్ర మోడీ.. ఆయా రాష్ట్రాల్లో సత్వర గృహాల నిర్మాణ (లైట్ హౌస్ ప్రాజెక్ట్-ఎల్హెచ్పీ) కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్-ఇండియా కింద ఈ ప్రాజెక్ట్ను కేంద్రం చేపట్టింది. ఇండోర్, రాజ్కోట్, చెన్నై, రాంచీ, అగర్తలా, లక్నోల్లో ఈ ఎల్హెచ్పీ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన ప్రదేశాల్లో వెయ్యి గృహాలను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. దీనికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులను మంజూరు చేస్తుంది. దీనికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ వాటా కింద నిధులను విడుదల చేస్తాయి.