
జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్-ఆగస్టు 1 డెడ్ లైన్- విఫలమైతే కోర్టుకు రావాల్సిందే
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా బకాయిలు ఉంచడంపై ఇవాళ హైకోర్టు మరోసారి వైసీపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లుల చెల్లింపు కోసం ఎన్నిసార్లు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోకపోవడంపై సీరియస్ అయింది. ఆగస్టు 1లోగా బిల్లులు చెల్లించాల్సిందేనని డెడ్ లైన్ విధించింది. ఇందులో విఫలమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు చేశారన్న కారణంతో వైసీపీ సర్కార్ ఉపాధి హామీ పనులు చేసిన వారికి బిల్లుల్ని రెండేళ్లుగా చెల్లించకుండా బకాయిలు పెట్టింది. దీంతో అప్పట్లో పనులు చేసిన వారు హైకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బిల్లులు చెల్లించాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. అయినా ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో హైకోర్టు ఇవాళ మరోసారి సీరియస్ అయింది.

ఆగస్టు 1లోగా ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే పంచాయతీరాజ్, ఆర్ధికశాఖల ముఖ్య కార్యదర్సులు కోర్టుకు హాజరై సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే వీరిద్దరూ ఓసారి కోర్టుకు హాజరై బిల్లుల చెల్లింపులపై వివరాలు అందించారు. అయినా ఇప్పటికీ బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఆదేశాలు ఎందుకు అమలు చేయట్లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పించుకుంటారని నిలదీసింది.