ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ నోటిఫై: జస్టిస్ రాకేష్ కుమార్ రిటైర్: ఆయన స్థానంలో
అమరావతి: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి బదిలీ అయ్యారు. ఆయనను సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమించారు. ఆయన బదిలీని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. ఆ శాఖ సంయుక్త కార్యదర్శి రాజీందర్ కశ్యప్.. కొద్దిసేపటి కిందటే ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. జేకే మహేశ్వరి స్థానంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నియమితులు అయ్యారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 222 క్లాజ్ (1) కింద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. ఆయన బదిలీని ధృవీకరించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డేను సంప్రదించిన తరువాతే రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జేకే మహేశ్వరి స్థానంలో.. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిక్కి చీఫ్ జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామిని నియమించినట్లు కేంద్రం వెల్లడించింది. దీనికోసం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది.

మరో న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ పదవీ విరమణను సైతం కేంద్రం నోటిఫై చేసింది. జస్టిస్ రాకేష్ కుమార్ స్థానంలో జోయ్మాల్యా బాగ్చీని నియమించారు. కోల్కత హైకోర్టు న్యామమూర్తిగా ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ నియామకాన్ని కూడా కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆమెను పదోన్నతి కల్పించి.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది. తెలంగాణ చీఫ్ జస్టిస్గా రాఘవేంద్ర సింగ్ చౌహాన్ను కోల్కతకు బదిలీ చేశారు.












Click it and Unblock the Notifications