ఇవాళ తుది విడత రైతు భరోసా నిధులు విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో
తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇవాళ తుది విడత రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ కానుంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథ పురంలో జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేయనున్నారు. ఈ సభలోనే సీఎం తుది విడత రూ.1,009 కోట్లు విడుదల చేయనున్నారు. ఇప్పటికే 8 ఎకరాల వరకు సాయం విడుదల కాగా మిగిలిన నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. ఇక గతనెల 30న హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో జరిగిన సభలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఖరీఫ్ పంట పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధుల పంపిణీ ఈ రోజుతో పూర్తి కానుంది. జూన్ 30న రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. 9 రోజుల్లో దాదాపు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. చివరి విడతగా రూ.1,009 కోట్ల రైతు భరోసా నిధులను ఖాతాల్లో జమ చేయనున్నారు. దాంతో ఈ టార్గెట్ పూర్తి కానుంది. తొలిరోజు రెండు ఎకరాల వరకు రూ. 878 కోట్లు విడుదల అయ్యాయి. ఆ తర్వాత వరుసగా 3, 4, 5, 6, 7 ఎకరాల వరకు సాయం అందజేశారు.
ఇక మొత్తంగా చూస్తే రైతు భరోసా పథకం కింద ఖరీఫ్ పంట సాగుకు పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్రవ్యాప్తంగా 1.45 కోట్ల ఎకరాల మేరకు భూములు గల 74 లక్షల మంది రైతులకు సాయం చేకూరనుంది. వీటితో పాటు కొత్తగా నమోదయ్యే వారికి, సాంకేతిక కారణాలతో సాయం నిలిచిన వారికి సైతం తర్వాత నిధులు విడుదల చేయనున్నారు.

ఇదే విషయంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తాజాగా మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయం, అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని పండగ చేయడమే ప్రజా ప్రభుత్వ ఆశయం అని తెలిపారు.












Click it and Unblock the Notifications