టీటీడీ బోర్డులో నేరచరితులకు హైకోర్టు డెడ్ లైన్-మార్చి 11లోపు కౌంటర్ ఇవ్వకపోతే ..
టీటీడీ పాలక మండలిలో సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితుల నియామకం వ్యవహారంపై న్యాయపరమైన చిక్కులు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. టీటీడీలో నేర చరితుల్ని సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను, అలాగే భారీ సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితుల్ని నియమిస్తూ ఇచ్చిన జీవోపైనా దాఖలైన పిటిషన్లను విచారిస్తు హైకోర్టు... ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
టీటీడీ పాలకమండలి సభ్యులు,ప్రత్యేక ఆహ్వానితులపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. టీటీడీ నియామకాలపై బీజేపీ నేత భానుప్రకాష్రెడ్డి పిటిషన్పై ఈ విచారణ కొనసాగింది. ఇందులో ప్రత్యేక ఆహ్వానితునిగా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాత్రమే పాలకమండలి భేటీకి హాజరుకావొచ్చని ఏపీ హైకోర్టు వెసులుబాటు కల్పించింది. మిగతా వారి విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చామని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తెచ్చింది. అయితే, ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ప్రత్యేక ఆహ్వానితుల పాత జోవో చెల్లదంటూ న్యాయవాది అశ్వినీ కుమార్ వాదనలు వినిపించారు.

మరోవైపు టీటీడీ పాలకమండలిలో 18 మంది సభ్యుల నేరచరిత్రపై దాఖలు చేసిన పిటిషన్పై కూడా వాదనలు జరిగాయి. ఇందులో వినిపించిన న్యాయవాది అశ్వినీ కుమార్.. నేటికీ 16 మంది కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ వీరికి హైకోర్టు ఆదేశించింది. మార్చి 11వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయకపోతే ఇక నేరుగా విచారణ చేపడతామని వీరికి ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో వీరంతా మార్చి 11లోగా కచ్చితంగా కౌంటర్లు దాఖలు చేయాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.












Click it and Unblock the Notifications