సీల్డ్ కవర్ లో దర్యాప్తు నివేదిక ఇవ్వండి: వివేకా హత్యపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసు సీబీఐకి అప్పగించాలని కోరుతూ టీడీపీ నేత బీటెక్ రవి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన విచారించిన హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 23వ తేదీ లోగా వివేకా హత్య కేసు దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీని పైన తదుపరి విచారణను 2020 జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఇదే కేసు పైన సిట్ విచారణ ముమ్మరం చేసింది. ఇప్పుడు కోర్టులో సీబీఐకు కేసు అప్పగించాలనే పిటీషన్ పైన కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల పైన ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుదనేది ఆసక్తి కరంగా మారింది.
సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వండి..
మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని టీడీపీ నేత బీటెక్ రవి దాఖలు చేసిన పిటీషన్ పైన హైకోర్టులో విచారణ సాగింది. దీని పైన విచారించి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23 లోపు దర్యాప్తు నివేదిక ను సీల్డ్ కవర్ లో హై కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని హై కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసును ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ సాగిస్తోంది. అందులో బాగంగా అనేక మందిని సిట్ విచారించింది.

అందులో భాగంగా టీడీపీ నేతలు పులివెందులకు చెందిన బీటెక్ రవితో పాటుగా జమ్మలమడుగు నేత..మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని సైతం విచారించింది. అయితే, హత్య జరిగిన సమయంలో తాను విజయవాడలో ఉన్నానని..ఈ హత్యతో తనకు ఏ మాత్రం సంబంధం ఉందని తేలితే.. ఎన్ కౌంటర్ చేయమని వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పటికే ఎంపీ అవినాశ్ తండ్రి ని సైతం సిట్ విచారించింది.
సీబీఐకు ఇవ్వాలని కోరుతూ ..
సిట్ ముందు హాజరై విచారణ ఎదుర్కొన్న తరువాత టీడీపీ నేత బీటెక్ రవి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమకు ఈ హత్యతో ఎటువంటి సంబంధం లేదని చెబుతూనే..ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీని ద్వారా టీడీపీ తొలి నుండి రాజకీయంగా చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరే విధంగా వ్యవహరిస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అదినారాయణ రెడ్డి సైతం వివేకా హత్య చేసిందెవరో..ఇంటి దొంగలకు తెలుసంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో హత్య సమయంలో ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందున్న పరమేశ్వర రెడ్డిని సైతం సిట్ తాజాగా విచారించింది. త్వరలోనే వాస్తవాలను బయట పెడతామని సిట్ అధికారులు చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల పైన ఏరకంగా స్పందిస్తుందీ.. రాజకీయంగా ఇది ఎటువంటి పరిణామాలకు కారణం అవుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications