జగన్ సర్కార్ కు హైకోర్టు డెడ్ లైన్-ఉపాధి హామీ బిల్లులు 4 వారాల్లో చెల్లించాల్సిందే-వడ్డీతో కలిపి
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం కింద వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు వైసీపీ ప్రభుత్వం ముందుకు రాలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం తీరుపై హైకోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్లకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుపై జగన్ సర్కార్ కు హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుకు ముందుకు రాని ప్రభుత్వం.. వైసీపీ హయాంలో జరిగిన పనులకు మాత్రం యథావిధిగా బిల్లులు చెల్లిస్తోంది. దీన్ని హైకోర్టులో కాంట్రాక్టర్లు సవాల్ చేసారు. విచారణ జరిపిన హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. దీంతో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరిగాయని కొన్నాళ్లు, విజిలెన్స్ విచారణ జరుగుతోందని మరికొన్నాళ్లు ఆలస్యం చేశారు. హైకోర్టు పదే పదే హెచ్చరికలు చేస్తున్నా, అధికారుల్ని హైకోర్టుకు రప్పిస్తున్నా ప్రభుత్వం మాత్రం తీరుమార్చుకోలేదు. దీంతో ఇవాళ హైకోర్టు ఈ వ్యవహారంపై విచారణ పూర్తి చేసి కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన హైకోర్టు.. ఈ బిల్లుల బకాయిల్ని నాలుగు వారాల్లోగా కాంట్రాక్టర్లకు చెల్లించి తీరాలని తీర్పు ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు బిల్లుల చెల్లింపు కోసం హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా అమలు కాకపోవడంతో ఈసారి ఇచ్చిన తీర్పు ఏ మేరకు అమవుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే 20 శాతం మొత్తం మినహాయించుకుని బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన సర్క్కులర్ ను సైతం హైకోర్టు కొట్టేసింది. అంతే కాదు ఏడాదికి 12 శాతం వడ్డీతో ఈ బిల్లుల బకాయిల్ని కాంట్రాక్టర్లకు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే కొందరికి కొంతమొత్తం చెల్లించినందున మిగిలిన మొత్తాల్ని లెక్కించి వడ్డీతో సహా చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ ప్రక్రియ నాలుగు వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు గడువు కూడా పెట్టింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు చేశారన్న కారణంగా ఉపాధి హామీ పనుల బిల్లుల్ని చెల్లించేందుకు వైసీపీ సర్కార్ ముందుకు రాలేదు. అంతే కాదు విజిలెన్స్ విచారణలతో పేరుతో కొంతకాలం, కేంద్రం బిల్లులు చెల్లించడం లేదని మరికొంతకాలం ఆలస్యం చేసింది. కానీ చివరికి హైకోర్టు ఆదేశాలతో ఈ బిల్లుల్ని వడ్డీతో సహా చెల్లించక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది.