జనసేన నేతలకు హైకోర్టు బెయిల్-అరెస్టుచేయొద్దని ఆదేశం-పవన్ కళ్యాణ్ థ్యాంక్స్
ఏపీలో తాజాగా చోటు చేసుకన్న విశాఖ ఘటనలు రేపిన కలకలం అందరికీ తెలిసిందే. విశాఖ గర్జన కోసం అక్కడికి వెళ్లిన మంత్రులు తిరిగి ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలు, నేతలు మంత్రుల కార్లపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం కేసులు నమోదు చేసి నేతల్ని జైళ్లకు పంపింది.
విశాఖ ఘటనల్లో అరెస్టు అయిన జనసేన నేతలకు హైకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది.
జనసేన నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖపట్నం ఎయిర్ పోర్టు సంఘటనలో అరెస్ట్ అయిన 8 మంది జనసేన నాయకులకు బెయిల్ లభించింది. దీంతో ప్రస్తుతం విశాఖపట్నం జైలులో వున్న జనసేన నాయకులు విడుదల కానున్నారు.

మరోవైపు విశాఖ ఘటనలో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన జనసేన ప్రధాన కార్యదర్శులు టి.శివ శంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ డాక్టర్స్ సెల్ ఛైర్మన్ డా.రఘులను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీరిపై తదుపరి విచారణను వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై జనసేనాని పవన్ సంతోషం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో జనసేన నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బనాయించిన హత్యాయత్నం కేసుకు సంబంధించి 9 మందికీ గౌరవ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషకరమని పవన్ తెలిపారు.
తాము ఎప్పుడూ న్యాయ వ్యవస్థను సంపూర్ణంగా విశ్వసిస్తామని, ఆ నమ్మకంతోనే న్యాయ స్థానాన్ని ఆశ్రయించామన్నారు. గౌరవ హైకోర్టుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ పవన్ ఓ ప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications