మేనిఫెస్టో ట్రబుల్: చిక్కుల్లో చంద్రబాబు..నిమ్మగడ్డ: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కిందటి నెల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టో వ్యవహారం..ఆయనకు న్యాయపరమైన ఇబ్బందులను సృష్టించింది. పంచాయతీ ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా మేనిఫెస్టోను విడుదల చేయడం పట్ల ఏపీ హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేయనుంది. చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు కూడా నోటీసులు అందనున్నాయి.
నిజానికి- పంచాయతీ ఎన్నికలను పార్టీ గుర్తు రహితంగా నిర్వహిస్తారు. గ్రామాల్లో రాజకీయపరమైన కక్షలు ఏర్పడకుండా ఉండటానికి పార్టీ రహితంగా ఎన్నికల ప్రక్రియను చేపడతారు. ఫలానా వర్గం.. ఫలానా పార్టీకి చెందిన వారిగా ముద్ర పడితే.. ప్రత్యర్థులు దాడులు చేసే అవకాశాన్ని నిలువరించడానికే ఈ ఏర్పాటు. దీనికి భిన్నంగా చంద్రబాబు ఏకంగా మేనిఫెస్టోనే విడుదల చేశారు. ఇప్పటిదాకా పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టెను విడుదల చేసిన దాఖలాల్లేవు.

మేనిఫెస్టోను విడుదల చేయడమనేది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. దీనిపట్ల రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం.. చంద్రబాబుపై ఎలాంటి చర్యలను తీసుకోలేదంటూ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలైంది. ఇందులో ప్రతివాదులుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్, కేంద్ర ఎన్నికల కమిషన్, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ పేర్లను చేర్చారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. వాదోపవాదాలను ఆలకించింది.
నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసినప్పటికీ.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, కేంద్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులను ఇచ్చింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. చంద్రబాబు సహా నిమ్మగడ్డ రమేష్ కుమార్కు నోటీసులను జారీ చేయాలని ఆదేశించింది. దీనిపై విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications