Chandrababu : చంద్రబాబు బెయిల్ పై హైకోర్టు నిర్ణయం వాయిదా !
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు ఇతర కేసులు కూడా వెంటాడుతున్నాయి. వీటిపై బెయిల్ కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ప్రస్తుతానికి ఊరట దక్కలేదు. ఓవైపు పోలీసులు చంద్రబాబును స్కిల్ కేసులో బయటికి వస్తే మిగతా కేసుల్లో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
గత నెలలో అన్నమయ్య జిల్లాలో ప్రాజెక్టు సందర్శన కోసం చంద్రబాబు వెళ్లినప్పుడు అక్కడ చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు కారణంగా చూపుతూ పోలీసులు పలు కేసులు పెట్టారు. ఈ కేసుల్లో చంద్రబాబుతో పాటు పలువురు మిగతా నిందితులు కూడా ఉన్నారు. వీరంతా ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకుని తీసుకున్నారు కూడా. అయితే చంద్రబాబు మాత్రం ముందస్తు బెయిల్ తీసుకునేందుకు ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు పరిస్ధితులు మారాయి. దీంతో అంగళ్లు ఘటనలో తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.

కానీ ఇవాళ అంగళ్లు కేసులో విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో పోలీసులు పూర్తి వివరాలు సమర్పించకపోవడంతో కేసును వచ్చే వారానికి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో పోలీసులు సమర్పించే వివరాల ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. పోలీసులు వాటిని సమర్పించలేదు. దీంతో వచ్చే వారం విచారణకు పూర్తి వివరాలతో రావాలని హైకోర్టు ఆదేశించింది.
చంద్రబాబు ఇప్పుడు స్కిల్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉంటూ దీన్ని క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు వచ్చే సోమవారం నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అంగళ్లు కేసులో చంద్రబాబును మరోసారి అరెస్టు చేసినట్లు చూపించి పీటీ వారెంట్ పై మరో జైలుకు తీసుకెళ్లే అవకాశముంది. అలాగే స్కిల్ కేసులో విడుదలైనా వెంటనే అరెస్టు చేసేందుకు వీలుగా పోలీసులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో అప్రమత్తమైన చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతున్నారు. కానీ హైకోర్టు మాత్రం నిర్ణయం ఈ నెల 20కి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications