Ab Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్ ! అంతలోనే..
ఏపీలో మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలు విషయాల్లో జగన్ సర్కార్ తో అమీతుమీ అన్నట్లుగా సాగుతున్న ఆయన ప్రస్ధానంలో ఇది మరో షాక్ గా మారింది. గత టీడీపీ ప్రభుత్వంలో నిఘా పరికరాల కొనుగోలుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ను వైసీపీ సర్కార్ రాగానే సస్పెండ్ చేసింది. అయితే వీటిపై సుప్రీంకోర్టు వరకూ వెళ్లి కాస్త ఊరట పొందినా అంతిమంగా శాఖాపరమైన చర్యలు తప్పలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా తాను విదేశీ టూర్ కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వాన్ని ఏబీ వెంకటేశ్వరరావు కోరారు. ఈ మేరకు సీఎస్ కు ఓ లేఖ సమర్పించారు. దీన్ని పరిశీలించిన సీఎస్..అనుమతి నిరాకరించారు. దీంతో ఏబీ హైకోర్టును ఆశ్రయించారు. తన విదేశీ టూర్ కు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన ఇప్పటికే కోర్టులో ఉన్న పిటిషన్ కు అనుబంధంగా దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు కూడా అనుమతి నిరాకరించింది.

ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు తనకు లభించే ఈఎల్ (ఎర్న్ డ్ లీవ్స్ )పై విదేశీ టూర్ కు వెళ్లేందుకు అనుమతి ఇప్పించాలని హైకోర్టును కోరారు. కానీ సాంకేతిక కారణాలతో ఈ పిటిషన్ ను తోసిపుచ్చుతూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే అందులో ఓ ఊరట ఇచ్చింది. సాంకేతిక అంశాలను సరిచేసుకుని మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. దీంతో ఆయన తాజాగా మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మళ్లీ ఇవాళ విచారణ జరపబోతోంది.
ఈ పిటిషన్ పై విచారణ తర్వాత ఏబీ వెంకటేశ్వరరావు విదేశీ టూర్ కు హైకోర్టు అనుమతిస్తే ఆయనకు ఊరట లభించే అవకాశముంది. అలాకాకుండా మళ్లీ తోసిపుచ్చితే మాత్రం ఎదురుదెబ్బ తప్పదు. ఇప్పటికే హైకోర్టులో ఏబీ వెంకటేశ్వరరావు సర్వీసు, జీతభత్యాల బకాయిలకు సంబంధించిన పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చే తీర్పు ప్రభావం అసలు పిటిషన్ పై ఉండే అవకాశం లేకపోయినా జగన్ సర్కార్ తో పోరు నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత పెరిగింది.












Click it and Unblock the Notifications