ఇంకా సోషల్ మీడియాలో జడ్డీల వ్యతిరేక పోస్టులు-సీబీఐ, ట్విట్టర్, యూట్యూబ్ కు హైకోర్టు వార్నింగ్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైకోర్టు నుంచి వెలువడిన కొన్ని తీర్పులతో సోషల్ మీడియాలో ఆ తీర్పులు ఇచ్చిన జడ్డీలతో పాటు హైకోర్టుకు వ్యతిరేకంగా కొన్ని పోస్టులు వెలిశాయి. వీటిపై రాష్ట్ర దర్యాప్తు సంస్ధల దర్యాప్తుకు ఆదేశించిన హైకోర్టు.. చర్యలు తీసుకోకపోవడంతో సీబీఐకి అప్పగించింది. అదే సమయంలో జడ్డీలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఉన్న పోస్టులు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే నెలలు గడుస్తున్న ఆ పోస్టులు అలాగే ఉన్నాయి.
జడ్డీలపై సోషల్ మీడియా పోస్టులు
ఏపీలో హైకోర్టు జడ్డీలపై సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇప్పటికే సీబీఐకి ఈ కేసును అప్పగించిన హైకోర్టుకు విచారణ సందర్భంగా చుక్కలు కనిపిస్తున్నాయి. తొలుత హైకోర్టు ఆదేశాల్ని లైట్ తీసుకున్న సీబీఐ నత్తనడకన ఈ కేసును దర్యాప్తు చేస్తుండటంతో విమర్శలు వచ్చాయి.
ఈ దశలో జోక్యం చేసుకున్న హైకోర్టు సీబీఐకి చీవాట్లు పెట్టింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ.. సోషల్ మీడియా సంస్ధలకు నోటీసులిచ్చి సదరు పోస్టుల్ని తొలగించాలని కోరింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఈసారి సోషల్ మీడియా సంస్ధలు లైట్ తీసుకున్నాయి.
సీబీఐని పట్టించుకోని సోషల్ దిగ్గజాలు
హైకోర్టు ఆదేశాల మేరకు సోషల్ మీడియాలో జడ్డీలకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టులు తొలగించాలని సీబీఐ. ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్ లకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసుల్ని ఆయా సంస్ధలు లైట్ తీసుకున్నాయి. నామమాత్రంగా పోస్టులు తొలగించి మిగతా వాటిని వదిలేశాయి. దీంతో ఈ వ్యవహారం మరో వివాదానికి దారి తీస్తోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సీబీఐ ఇచ్చిన నోటీసుల్ని సైతం సోషల్ మీడియా సంస్ధలు లైట్ తీసుకోవడం వెనుక ఉన్న కారణాలపై చర్చ మొదలైంది. అయితే సోషల్ మీడియా సంస్ధలు ఇందుకు గల కారణాల్ని వెల్లడించాయి.
కేంద్రం ఆదేశాల సాకుతో
కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాను కట్టడి చేసే క్రమంలో గతేడాది ఐటీ చట్టంలో మార్పులు చేసింది. వీటి ప్రకారం సోషల్ మీడియా సంస్ధలు కొన్ని సంస్ధలు, ప్రభుత్వాలు, కోర్టుల ఆదేశాల ప్రకారమే వివాదాస్పద పోస్టుల్ని తొలగించాల్సి ఉంటుంది. ఇందులో కోర్టు ఆదేశాలు ఉంటే, కేంద్రం నోటిఫై చేసిన సంస్ధల ఆదేశాలు ఉంటేనే వీడియోలు తొలగిస్తామని చెప్పేశాయి. ఈ జాబితాలో సీబీఐ లేదని కూడా హైకోర్టుకు తెలిపాయి. దీంతో హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తాము నేరుగా ఆదేశాలు ఇచ్చినా సోషల్ మీడియా సంస్ధలు పట్టించుకోకపోవడంపై నిన్న విచారణ జరిపింది.
సోషల్ మీడియాపై హైకోర్టు ఆగ్రహం
సోషల్ మీడియా సంస్ధలు తాము ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాల మేరకే సీబీఐ నోటీసులు జారీ చేసినా సోషల్ మీడియా నుంచి జడ్డీలకు వ్యతిరేక వీడియోలు, పోస్టులు తొలగించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. తమ ఆదేశాల్ని సరైన స్ఫూర్తితో అమలు చేయడం లేదని సీరియస్ అయింది. జడ్డీలకు వ్యతిరేక పోస్టులపై రిజిస్ట్రార్ జనరల్ తో పాటు సీబీఐ వివరాలు ఇచ్చినా తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో సోషల్ మీడియా సంస్ధలు ఇరుకునపడ్డాయి.
హైకోర్టు సీరియస్ వార్నింగ్
సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వివరాలు ఇచ్చినా ఆయా సంస్ధలు వాటిని తొలగించడం లేదని సీబీఐ ఆరోపించగా... లేదు తాము తొలగించామని సోషల్ సంస్ధలు హైకోర్టుకు తెలిపాయి. ఈ భిన్న వాదనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. పోస్టుల తొలగింపులో హైకోర్టుకు ఎవరు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.
సీబీఐతో పాటు సోషల్ మీడియా సంస్ధలపై కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది. ఇప్పటివరకూ సీబీఐ ఇచ్చిన సోషల్ పోస్టుల వివరాలు, వాటిని తొలగించేందుకు సోషల్ సంస్ధలు తీసుకున్న చర్యల వివరాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.