అనుమతిలేని విత్తనాల్ని అంటగట్టారు: ఆ రెండు కంపెనీలకు ఏపీ ప్రభుత్వం నోటీసులు
హైదరాబాద్: ప్రముఖ పత్తి విత్తనాల కంపెనీలైన నూజివీడు సీడ్స్, కావేరీ సీడ్స్ లకు ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో హెర్బిసైడ్ పత్తి విత్తనాలను అక్రమంగా రైతులకు అంటగట్టినందుకు ఈ చర్యలు తీసుకుంది.
ఈ మేరకు జనవరి 29న ఆంధ్రప్రదేవ్ డీజీపీ రెండు కంపెనీలకు నోటీసులు పంపించి దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. ఐదు రోజుల్లోగా దీనిపై నిపుణుల కమిటీకి నివేదిక అందజేయాల్సిందిగా తెలిపారు. కాగా, జెనెటిక్ ఇంజినీరంగ్ అప్రూవల్ కమిటీ(జీఈఏసీ) అనుమతి లేని విత్తనాలను ఈ రెండు కంపెనీలు విక్రయించినట్టు నిర్దారించారు.

ఖండించిన నూజివీడు గ్రూప్ ఛైర్మన్:
నోటీసులపై నూజివీడు గ్రూప్ ఛైర్మన్ ఎం ప్రభాకర్ రావు స్పందించారు. తమపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రభుత్వం తమ కంపెనీకి పొరపాటున నోటీసులు పంపించిందని, ఇదివరకే ప్రభుత్వానికి ఈ విషయాన్ని చెప్పానని ఆయన పేర్కొన్నారు. హెర్బిసైడ్ సీడ్స్ విక్రయించినట్టు నిజ నిర్దారణ కమిటీ కూడా నిర్దారించలేదని చెప్పారు.

అనుమతి లేకుండానే..
పత్తి వంగడాలకు జన్యుపరమైన మార్పులతో తీసుకొచ్చిన హెర్బిసైడ్ కాటన్ విత్తనాలు.. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అనుమతి లేకుండానే రైతులకు విక్రయించినట్టు గతేడాది ప్రభుత్వాలకు ఫిర్యాదు అందింది. దీనిపై అప్పట్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు విచారణ కూడా చేపట్టాయి.

నోటీసుల్లో ఏముంది:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసుల్లో.. 'హెర్బిసైడ్ టోలరెంట్ కాటన్(రౌండప్ రెడీ ప్లెక్స్) విత్తనాలు బోల్గార్డ్- I(బీజీ I), బీజీ II, సీపీ4-ఈపీఎస్పీఎస్ జీన్స్ కలిగి ఉన్నాయి.
అలాగే వీటిని కమర్షియల్గా విక్రయించేందుకు కేంద్రం నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. మేము గుర్తించిన శాంపిల్స్ సీపీ4_ఈపీఎస్పీఎస్ లో హెచ్టి పాజిటివ్ ఉన్నట్టు తేలింది. ఇది అక్రమం మరియు దీనికి అనుమతి లేదు' అని పేర్కొన్నారు.

నిర్దారించిన కమిటీ..
కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని రైతులకు వీటిని విక్రయించడంతో.. ఇద్దరు నిపుణులతో కూడిన ప్యానెల్ ఇటీవలే ఈ రెండు జిల్లాల్లో గతేడాది అక్టోబర్ నెలలో తనిఖీలు చేపట్టింది. ఆయా పంటల నుంచి కొన్ని శాంపిల్స్ కూడా సేకరించింది.
శాంపిల్స్ లో హెచ్టి(హెర్బిసైడ్ టోలరెంట్) పాజిటివ్ అని తేలడం.. రైతులు కూడా తాము నూజివీడు సీడ్స్, కావేరీ సీడ్స్ విక్రయించిన హైబ్రిడ్ విత్తనాలనే ఉపయోగించామని చెప్పడంతో ఈ రెండు సంస్థలకు నోటీసులు జారీ చేశారు. రైతులకు విక్రయించిన హెచ్టి పత్తి విత్తనాలను రాజా వెరైటీ ఆఫ్ నూజీవీడు, ఏటీఎం హైబ్రిడ్, కావేరీ 401, కావేరీ 141గా గుర్తించారు.












Click it and Unblock the Notifications