ఏపీలో భూహక్కు చట్టానికి చెక్-హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు-అసెంబ్లీలో కీలక బిల్లులు..!
ఏపీ అసెంబ్లీ ఇవాళ రెండు కీలక బిల్లుల ఆమోదానికి వేదిక కాబోతోంది. ఇందులో ఏపీ భూహక్కు చట్టం రద్దుతో పాటు విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లులు ఉన్నాయి. వీటిలో భూహక్కు చట్టం రద్దు ఎన్డీయే ఎన్నికల హామీ కాగా.. వైఎస్సార్ వర్సిటీ పేరు ఎన్టీఆర్ గా మార్పు టీడీపీ వ్యక్తిగత అజెండాలోనిది. దీంతో ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
రాష్ట్రంలో గతేడాది వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన భూహక్కు చట్టంపై ముందునుంచీ వివాదాలున్నాయి. దీనిపై లాయర్లు కూడా హైకోర్టును ఆశ్రయించారు. గత ఎన్నికల సమయంలో ఈ చట్టం వల్ల నష్టాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్డీయే పార్టీలు భారీ రాజకీయ ప్రయోజనం పొందాయి. తమను గెలిపిస్తే ఈ వివాదాస్పద చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించాయి. దీంతో జనం కూడా ఏకపక్షంగా ఎన్డీయేకు ఓటేసి గెలిపించారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి రాగానే రెండో సంతకం భూహక్కు చట్టం రద్దుపైనే పెట్టిన సీఎం చంద్రబాబు.. అనంతరం తొలి కేబినెట్ లోనే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ దీన్ని బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించబోతున్నారు.

మరోవైపు విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును కూడా గతేడాది వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్ పేరుతో మార్చింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా అప్పటి జగన్ సర్కార్ పట్టించుకోలేదు. దీంతో అప్పటివరకూ ఎన్టీఆర్ మావాడే అని వైసీపీ చెప్పిన మాటలకు విలువలేకుండా పోయింది. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా దీన్ని అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే తిరిగి ఎన్టీఆర్ పేరుకు మార్చడం ఖాయమని ప్రకటించింది. అన్నట్లుగానే ఇవాళ అసెంబ్లీలో బిల్లు తెస్తోంది.












Click it and Unblock the Notifications