మండలి రద్దుపై వైసీపీకి బీజేపీ షాక్? గవర్నర్తో చైర్మన్ షరీఫ్ భేటీ.. ఢిల్లీలోనూ కీలక పరిణామాలు
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు విషయంలో జగన్ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం షాకివ్వబోతోందా? పార్టీ పరంగా మండలి రద్దును వ్యతిరేకిస్తోన్న బీజేపీ.. పార్లమెంటులోనూ అదే వైఖరి అనుసరించనుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. మండలి రద్దుపై అసెంబ్లీలో తీర్మానం తర్వాత సైలెంట్ గా ఉండిపోయిన చైర్మన్ షరీఫ్ సడెన్ గా మంగళవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయి, కీలక చర్చలు జరపడం సరికొత్త చర్చకు తెరలేపినట్లయింది.

చైర్మన్ ఏం చెప్పారంటే..
శాసన మండలి రద్దు ప్రక్రియలో వైసీపీ సర్కారు రాజ్యాంగ నియమాల్ని ఉల్లంఘించిందని, అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించకముందే పెద్దల సభను ఖతంచేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని చైర్మన్ షరీఫ్.. గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏర్పాటైన సెలెక్ట్ కమిటీల విషయంలో మండలి అధికారుల వ్యవహరించిన తీరును కూడా చైర్మన్ ప్రస్తావించారు.

అధికారాలపై స్పష్టత ఇవ్వండి..
మండలి చైర్మన్ గా తనకున్న ప్రత్యేక అధికారాలతో రెండు బిల్లులపై సెలెక్ట్ కమిటీలు వేశానని, కమిటీల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి రెండు సార్లు ఆదేశాలు జారీచేసినా వాటిని మండలి కార్యదర్శి వెనక్కి పంపారని గవర్నర్ కు చైర్మన్ షరీఫ్ వివరించారు. ఏపీ శాసన మండలి రద్దుకు కేంద్రం ఆమోదం తెలపబోతోందన్న వార్తల నేపథ్యంలో అసలు చైర్మన్ అధికారాలపై స్పష్టత ఇవ్వాలని షరీఫ్ కోరినట్లు సమాచారం. చైర్మన్ వివరణపై గవర్నర్ కన్సర్న్ చూపినట్లు తెలిసింది.

కేంద్రం పెద్దల ఆదేశంతోనే?
మండలి రద్దును ఎలాగైనాసరే అడ్డుకుంటామన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఈ విషయంలో కేంద్రం పెద్దల సహకారం కోరేందుకు టీడీపీ ఎమ్మెల్సీల బృందాన్ని ఢిల్లీకి పంపారు. రాష్ట్రంలో కేంద్రం ప్రతినిధిగా ఉన్న గవర్నర్ వైపు నుంచి కూడా ఒత్తిడి తెచ్చేలా చైర్మన్ ను రంగంలోకి దింపారు. కాగా, ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే గవర్నర్ హరిచందన్.. మండలి చైర్మన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే మండలి రద్దు వ్యవహారంలో వైసీపీకి ఎదురుగాలి మొదలైనట్లేనని భావించాల్సిఉంటుంది.

ఢిల్లీలో ఏపీ హీట్..
మూడు రాజధానుల ఏర్పాటు, మండలి రద్దు నిర్ణయాలను పార్టీ పరంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, వైసీపీ సర్కారు నిర్ణయాన్ని కేంద్రం ఆమోదిస్తుందని ఏపీ బీజేపీ నేతలు పైకి చెబుతున్నప్పటికీ, లోపల ఇంకేదో జరుగుతోందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఏపీ సీఎం జగన్ గతవారం రెండు సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ మండలి రద్దు, మూడు రాజధానులపై కేంద్రం క్లారిటీ తీసుకోలేకపోయారని, ఈ విషయం తెలుసుకున్న తర్వాతే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్సీలను ఢిల్లీకి పంపారనే చర్చ జరుగుతోంది. మరోవైపు వైసీపీ మంత్రులు కూడా వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తుండటంతో ఏపీ వ్యవహారాలు మరోసారి వేడెక్కాయి.












Click it and Unblock the Notifications